Gandhi Hospital: టీకా తీసుకున్న వారిలో ఒక్కరు కూడా మరణించలేదు: ‘గాంధీ’ సూపరింటెండెంట్

None of those vaccinated died said Gandhi superintendent
  • కొందరికి వెంటిలేటర్లు అవసరమైనా కోలుకున్నారు
  • ప్రైవేటు ఆసుపత్రులలో చేరి డబ్బులు పోగొట్టుకుంటున్నారు
  • చివరి నిమిషంలో ‘గాంధీ’కి వస్తున్నారు
  • రక్తంలో ఆక్సిజన్ 95 శాతం కంటే ఎక్కువ ఉంటే భయంలేదు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడిన వారిలో ఒక్కరు కూడా మరణించలేదని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.  టీకా తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన 15 మందీ కోలుకున్నారని తెలిపారు. బాధితుల్లో కొందరికి వెంటిలేటర్లు అవసరమైనా ఒక్కరి ఆరోగ్యం కూడా విషమించలేదని, అందరూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. టీకా వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఇది చక్కని ఉదాహరణ అని డాక్టర్ రాజారావు పేర్కొన్నారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 650 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, 400 మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నట్టు చెప్పారు. వీరిలో దాదాపు 15 శాతం మంది వరకు ఇంట్లో చికిత్స తీసుకుని ఆ తర్వాత ఇక్కడకు వచ్చినవారేనని, 75 శాతం ప్రైవేటు ఆసుపత్రులలో చేరి డబ్బులు ఖర్చు చేసినా నయం కాకపోవడంతో ఆఖరి నిమిషంలో ఇక్కడకు వచ్చిన వారేనని తెలిపారు. చాలామంది భయంతో ముందే ఆసుపత్రులలో చేరడం వల్ల బెడ్స్ నిండిపోతున్నాయన్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 95 శాతం కంటే ఎక్కువ ఉంటే ఆసుపత్రులలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్ రాజారావు తేల్చి చెప్పారు.
Gandhi Hospital
Secunderabad
Dr Raja Rao
COVID19

More Telugu News