CPI Ramakrishna: సుప్రీం తీర్పు తర్వాత ఏపీ ప్రభుత్వంలో మార్పు వస్తుందనుకున్నాం.. కానీ అది జరగలేదు: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna fires on YSRCP govt
  • ఎస్ఈసీని కించపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారు
  • దౌర్జన్యంగా గెలవాలనుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకు?
  • ఎన్నికలు అయ్యేంత వరకు రేషన్ డోర్ డెలివరీని ఆపేయాలి
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై ఏపీ మంత్రులు విమర్శలు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వస్తుందని, ఎన్నికలకు సహకరిస్తుందని అందరూ భావించారని... కానీ అది జరగలేదని అన్నారు. బాధ్యతాయుత మంత్రుల స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఎన్నికల కమిషన్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ వాయిస్ గా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎస్ఈసీని కించపరిచేలా మాట్లాడుతున్నారని రామకృష్ణ అన్నారు. బెదిరింపులు, దాడులు, ప్రలోభాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా 2 వేలకు పైగా ఎంపీటీసీ, 125 జడ్పీటీసీలను వైసీపీ కైవసం చేసుకుందని విమర్శించారు. ఇలా దౌర్జన్యంగా గెలవాలనుకున్నప్పుడు అసలు ఎన్నికలు ఎందుకని నిలదీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏకగ్రీవాలపై ఎందుకు ప్రకటనలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని రామకృష్ణ అన్నారు. జగన్ ఫొటోలతో ఉన్న వాహనాల ద్వారా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని... ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధమని అన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు రేషన్ డోర్ డెలివరీని ఆపేయాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
CPI Ramakrishna
Jagan
Peddireddi Ramachandra Reddy
Botsa Satyanarayana
YSRCP
Gram Panchayat Elections

More Telugu News