ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారీలో తప్పు జరిగిపోయిందట!
- వ్యాక్సిన్ తీసుకున్నా కొంతమందిలో పెరగని రోగ నిరోధక శక్తి
- తయారీలో లోపం కారణంగానేనన్న ఆస్ట్రాజెనికా
- తక్కువ డోస్ పొందిన వారిలో 90 శాతం పనిచేస్తున్న వ్యాక్సిన్
తామిచ్చిన వ్యాక్సిన్ డోస్ లను తీసుకున్న వారిలో కరోనా నిరోధక శక్తి భారీగా పెరిగిందని ఆక్స్ ఫర్డ్ ప్రకటించిన రోజుల తరువాత, కొంతమంది వాలంటీర్లు రెండు డోస్ లను తీసుకున్నా, పొందాల్సినంత వ్యాధి నిరోధకతను పొందలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో సంస్థ స్పందించింది. వారు తీసుకున్న టీకా తయారీలో తప్పు జరిగిందని తెలిపింది.
కాగా, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో కరోనా వైరస్ ను నిలువరించే శక్తి అధికమైందని, రెండు డోస్ లను తీసుకున్న వారితో పోలిస్తే, ఒక డోస్ పొందిన వారిలోనే ఈ శక్తి ఎక్కువగా కనిపించిందని వర్శిటీ తన ఫలితాల రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే.
తక్కువ డోస్ పొందిన వారిలో 90 శాతం పనితీరు కనిపించిందని, రెండు డోస్ లను పొందిన వారిలో ఇది 62 శాతంగా నమోదైందని ఆస్ట్రాజెనికా వెల్లడించింది. కాగా, ప్రస్తుతం యూకేతో పాటు బ్రెజిల్ లోనూ ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది.