టార్గెట్లు కాదు.. భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

Hyderabad Police Commissioner urges banks to ensure zero mule accounts
  • సైబర్ మోసాల కట్టడిపై బ్యాంకులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నతస్థాయి సమావేశం
  • 'జీరో మూల్ అకౌంట్లు' లక్ష్యంగా పనిచేయాలని బ్యాంకులకు ఆదేశం
  • అకౌంట్ల సంఖ్య కన్నా పౌర భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
  • మోసాలకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
  • విదేశాల కేంద్రంగా సైబర్ మోసాలు.. బ్యాంకు అధికారుల పాత్రపై సీపీ ఆందోళన
సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని, 'జీరో మ్యూల్ అకౌంట్లు' లక్ష్యంగా పనిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. గురువారం నగరంలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల నుంచి దోచుకున్న డబ్బును మళ్లించేందుకు వాడే 'మ్యూల్ అకౌంట్ల'ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

ఇటీవల హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన 'ఆపరేషన్ ఆక్టోపస్'లో భాగంగా మ్యూల్ అకౌంట్లు తెరిచేందుకు కొందరు బ్యాంకు అధికారులు సైబర్ నేరగాళ్లకు సహకరించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ బ్యాంకు అధికారులతో నేరుగా మాట్లాడారు. అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్) ఎం. శ్రీనివాసులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... "బ్యాంకు బ్రాంచ్‌లు కొత్త ఖాతాలు తెరిచే టార్గెట్లపై కాకుండా, పౌరుల భద్రత, సంస్థాగత సమగ్రతపై దృష్టి పెట్టాలి. దీనికోసం 'ట్విన్-ఛాలెంజ్' విధానాన్ని ప్రవేశపెట్టాలి. 'జీరో సైబర్ క్రైమ్ బాధితులు', 'జీరో మ్యూల్ అకౌంట్లు' అనే అంశాలను బ్రాంచ్‌ల పనితీరుకు కొలమానంగా (KPIs) తీసుకోవాలి. ఖాతాల సంఖ్యను పనితీరుకు ప్రామాణికంగా చూడొద్దు" అని సూచించారు.

సైబర్ మోసాలకు సంబంధించి తమ సంస్థలో 'జీరో టాలరెన్స్' విధానాన్ని పాటించాలని, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించి, వారికి జాతీయ హెల్ప్‌లైన్ (1930), సైబర్‌క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in) గురించి తెలియజేయాలని ఆదేశించారు. మోసపూరిత ఖాతాలు తెరవడంలో పాలుపంచుకున్న కేవైసీ వెరిఫైయర్లపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అలాంటి ఉద్యోగులను బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం నుంచే బ్లాక్‌లిస్ట్ చేయాలని అన్నారు. 'మ్యూల్ హంటర్' వంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మోసాలను గుర్తించాలని సూచించారు.

కంబోడియా, వియత్నాం, యూఏఈ వంటి దేశాల నుంచి సైబర్ ముఠాలు పనిచేస్తున్నాయని, అవి భారతీయ మధ్యవర్తుల ద్వారా బ్యాంకు అధికారులతో కుమ్మక్కై మ్యూల్ అకౌంట్లను తెరిచి, నిధులను తరలిస్తున్నాయని సజ్జనార్ వివరించారు. ఈ నెట్‌వర్క్‌లను ఛేదించడంలో బ్యాంకుల సహకారం అత్యంత కీలకమని ఆయన తెలిపారు.
Go Back to Shorts
VS Sajjanar
Hyderabad Police Commissioner
banks
mule accounts

More Telugu News