ఆర్టీసీ సమ్మె.. మంత్రుల కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం
- కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె
- సీఎం, డిప్యూటీ సీఎంలతో పొన్నం, వివేక్ చర్చలు
- కాసేపట్లో భేటీ కానున్న కేబినెట్
ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగ సచివాలయాన్ని తాకడంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. నిన్న రాత్రి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలతో భేటీ అయ్యి తాజా పరిస్థితులపై చర్చించారు. కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో ఇప్పటికే 29 అంశాలకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వేతన సవరణ (30 శాతం ఫిట్మెంట్), పెండింగ్ బకాయిలు, విలీనం వంటి కీలక అంశాలపై ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను నేడు కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ కేబినెట్ భేటీ అనంతరం సమస్యల పరిష్కారానికి ఒక మంత్రుల కమిటీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ కమిటీ కార్మిక సంఘాలతో నేరుగా చర్చలు జరిపి సమ్మె విరమింపజేసేలా వ్యూహం రచిస్తుంది.