కృష్ణానదిలో మళ్లీ పెరిగిన వరద... ఈ సీజన్ లో 8వ సారి గేట్ల ఎత్తివేత!
- నదిలో మరోమారు పెరిగిన వరద
- 82 వేల క్యూసెక్కుల నీరు దిగువకు
- నేడు మరోసారి తెరచుకోనున్న సాగర్ గేట్లు
ఈ సీజన్ లో శ్రీశైలం గేట్లను తెరవడం ఇది 8వ సారి కావడం గమనార్హం. జలాశయం నుంచి వివిధ ప్రాంతాలకు నీటిని తరలించే అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను నిరంతరంగా నడిపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం కూడా పనిచేస్తోంది. 7 జనరేటర్ల ద్వారా పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
కాగా, శ్రీశైలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా బయటకు పంపుతున్నామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. నేడు గేట్లను మరోసారి ఎత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.