Nara Lokesh: టీడీపీ హయాంలో వికేంద్రీకరణ ఫలాలు ఎలా అందాయో వైసీపీ ప్రభుత్వమే బయటపెట్టింది: లోకేశ్

  • చంద్రబాబు గారు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్ 
  • జగన్ గారు విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్
  • టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయని వైసీపీ చెప్పింది
  • జగన్ పాలనలో కంపెనీలు రాష్ట్రానికి గుడ్ బై చెబుతున్నాయి
lokesh fires on ycp leaders

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరిగితే, వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని చెప్పారు.

'చంద్రబాబు గారు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్ అయితే, జగన్ గారు విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్. టీడీపీ హయాంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు అన్ని జిల్లాలకు ఎలా అందాయో వైకాపా ప్రభుత్వమే పూసగుచ్చినట్టు బయటపెట్టింది' అని చెప్పారు.

'ఐదేళ్ల టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోంది' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'14 నెలల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి గుడ్ బై చెప్పిన కంపెనీలే తప్ప వచ్చిన ఒక్క కంపెనీ అయినా ఉందా?' అని లోకేశ్ ప్రశ్నించారు.

More Telugu News