కనువిందు చేస్తున్న జలదృశ్యం... నాగార్జునసాగర్ డ్యామ్ గేట్ల ఎత్తివేత!
- 550 అడుగులు దాటిన నీటిమట్టం
- గేట్లను తెరిచి పులిచింతలకు నీటి విడుదల
- నాలుగు గేట్లను తెరచిన అధికారులు
ఈ ఉదయం జలాశయం నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు, పులిచింతలకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. మరోవైపు కుడి, ఎడమ కాలువల నుంచి పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నారు. ఇక సాగర్ గేట్లు తెరవడంతో, దాదాపు 600 అడుగుల ఎత్తునుంచి కిందకు దుమికే కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు మాచర్ల, మిర్యాలగూడ తదితర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. రేపటికి సాగర్ కు సందర్శకులు మరింతగా పెరిగే అవకాశముంది.
కాగా, ఇటీవలి కాలంలో ఆగస్టు రెండో వారంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరవడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. ఇక కృష్ణానది నుంచి వివిధ జిల్లాలకు దారితీసే ఎస్ఆర్ బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి సర్కారు సన్నాహాలు చేస్తుండటంతో రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంవత్సరం నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఖరీఫ్ లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.