చంద్రబాబు సానుభూతిపరులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు: జగన్

YS Jagan Mohan Reddy Says Chandrababu Syndicate Is Running The State
  • భీమవరంలో ఆక్వా రైతులతో జగన్ ముఖాముఖి
  • ఫీడ్, సీడ్ రేట్లను చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారని విమర్శ
  • చంద్రబాబు ప్రతి అడుగు మోసమేనని మండిపాటు
రాష్ట్రంలో ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో ఉందని, ఆక్వా రైతులు దీనావస్థలో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన జగన్... ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ధరల పెరుగుదలకు హేతుబద్ధత ఉండాలని, ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. దున్నపోతు మీద వాన పడినట్టు ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. 

ఆక్వా రంగం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని జగన్ తెలిపారు. చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారని, చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఫీడ్ రేట్లు కేజీకి రూ.14 నుంచి 16కి ఎడాపెడా పెంచేశారని, ముష్టి వేసినట్టు కేజీకి రూ.2 తగ్గిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. రేట్లు పెంచితే పెంచేస్తారని... రేట్లు తగ్గితే తగ్గించరా అని మండిపడ్డారు. 

వైసీపీ హయాంలో ఆక్వా రైతుల కోసం 'అప్సడా' ఏర్పాటు చేశామని... సీడ్, ఫీడ్, మార్కెటింగ్‌లో సమస్యలు వస్తే పరిష్కరించామని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక 'అప్సడా'ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నామని, రొయ్యలకు మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశామని తెలిపారు. రైతుకు గిట్టుబాటు ధర తగ్గకూడదని చట్టం చేశామన్నారు. ఈరోజు కేజీ కౌంట్ రూ.230లు దాటని పరిస్థితి ఉందని చెప్పారు. 

ఆక్వా రైతులకు తాము 1.50కే యూనిట్ విద్యుత్ అందించామని, ఐదేళ్లలో సబ్సిడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల సబ్సిడీ బకాయిలు చెల్లించామన్నారు. చంద్రబాబు ప్రతి అడుగు మోసమని విమర్శించారు. ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh Aqua Farmers
Bhimavaram Aqua Meeting
APSADA
Aqua Feed Price Hike

More Telugu News