సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత జరిగే హడావుడిపై నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..!
- సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం'
- ఈ నెల 19న ప్రేక్షకులు ముందుకు వస్తున్న మూవీ
- ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నందిని
- విడుదల తేదీ ప్రకటించిన తర్వాత పనుల్లో వేగం పెరుగుతుందని వెల్లడి
టాలీవుడ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న పలు చిత్రాలను తెరకెక్కించిన నందినీ రెడ్డి టాలెంటెడ్ మహిళా దర్శకురాలిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విడుదల పనుల్లో ఆమె తలమునకలై ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా, సినిమా విడుదలకు ముందు ఉండే హడావుడి గురించి నందినీ రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "విడుదల తేదీ ప్రకటించనంత వరకు పనులు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా సాగుతాయి. ఒక్కసారి విడుదల తేదీ ఖరారైన వెంటనే టెక్నీషియన్లందరూ తమ పనులను పూర్తి చేయడానికి పూర్తి వేగంతో శ్రమిస్తారు. సినిమా అవుట్పుట్ను ముందుగానే సిద్ధం చేస్తే, మళ్లీ ఏదో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చివరి దశలో పనులు పూర్తి చేస్తారు. అందుకే విడుదల తేదీ ఫిక్స్ అయిన తర్వాత హడావుడి పెరుగుతుంది" అని ఆమె తెలిపారు. మరోవైపు, సమంత-నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.