సూర్యవంశీపై లక్నో ఓనర్ గోయెంకా ప్రశంసలు
- రాజస్థాన్ పై మ్యాచ్ లో 38 బంతుల్లో 93 పరుగులు చేసిన సూర్యవంశీ
- స్టేడియంలో నిలబడి అభినందనలు తెలిపిన సంజీవ్ గోయెంకా
- ఈ దేశం అతనిలో గొప్ప భవిష్యత్తును చూస్తోందని వ్యాఖ్య
ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్ రేసులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లో 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 93 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్కు ముగ్ధుడైన లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా... స్టేడియం స్టాండ్స్లో స్వయంగా నిలబడి చప్పట్లతో వైభవ్కు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా, మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఈ యువ ఆటగాడితో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు.
"ఈ ప్రపంచం ఇప్పటికే అతనిలోని ప్రతిభను చూసింది.. ఈ దేశం అతనిలో గొప్ప భవిష్యత్తును చూస్తోంది.. అతని భుజాలపై ఉన్న బాధ్యతను మోయగల సమర్థత అతనికి ఉంది" అంటూ సంజీవ్ గోయెంకా ఎక్స్ వేదికగా కొనియాడారు. మ్యాచ్ అనంతరం వైభవ్తో గోయెంకా మాట్లాడిన దృశ్యాలను చూసి, సునీల్ గవాస్కర్ వంటి కామెంటేటర్లు సరదాగా 'గోయెంకా త్వరలోనే వైభవ్ కోసం వేలంలో భారీగా బిడ్ వేయబోతున్నారు' అని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.