ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై కత్తులతో దాడి.. దాడి వెనుక కుట్ర ఉందన్న అభినయ్
- పాడేరు నియోజకవర్గంలో అభినయ్ దర్శన్ పై దాడి
- రాజకీయ పార్టీ పేరుతో మత ప్రచారం చేస్తావా అంటూ దాడి
- తనను అంతమొందించడానికి పక్కా స్కెచ్ వేశారని వ్యాఖ్య
ఏపీలో ఇటీవల 'భరోసా' పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన పాస్టర్ అభినయ్ దర్శన్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం నీరుతోటపాలెం సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పాస్టర్ అభినయ్ దర్శన్ తన అనుచరులతో కలిసి కారులో వెళుతుండగా ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. మొదట కారుపై కోడిగుడ్లు విసిరి అడ్డుకున్న దుండగులు, ఆ తర్వాత 'రాజకీయ పార్టీ పేరుతో మత ప్రచారం చేస్తావా?' అంటూ ఆయుధాలు, కత్తులతో పాస్టర్తో పాటు మరో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పాస్టర్ రోడ్డు పక్కన పడిపోగా, గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి ఆయనను చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న సమయంలో అభినయ్ దర్శన్ మీడియా ముందు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటన తరహాలోనే తనను కూడా పూర్తిగా అంతమొందించడానికే ఈ పక్కా స్కెచ్ వేశారని ఆరోపించారు. ఈ దాడి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
స్థానిక పోలీసుల విచారణపై తనకు అస్సలు నమ్మకం లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఈ కేసులో 'డబుల్ గేమ్' ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడిని తప్పుదోవ పట్టిస్తూ.. తనపై తానే దాడి చేయించుకున్నట్లు చూపేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో పాస్టర్లు అందరూ దొంగలే అనే తరహాలో ఒక తప్పుడు చిత్రీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.