Sridhar Babu: తులం బంగారం హామీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై రాజకీయ దుమారం కొనసాగుతున్నవేళ... రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని, మిగిలినవన్నీ ఈ ఐదేళ్ల పదవీ కాలంలోనే నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా తులం బంగారం హామీని కూడా త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ కావాలనే '420 హామీలు' అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని, వారి జిమ్మిక్కులను ప్రజలు నమ్మరని మంత్రి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ప్రాక్టికల్గా ఉంటూ ఆచరణాత్మక పథకాలను రూపొందిస్తోందని, కొద్దిగా ఆలస్యమైనా ప్రతి మాటనూ నిలబెట్టుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎం ఒక కెప్టెన్లా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని, కేబినెట్ అంతా ఐక్యంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.