క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం.. స్పందించిన కేటీఆర్

KTR Reacts as BRS Wins Kyathanpalli Ibrahimpatnam Municipalities
  • కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ఆ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుందన్న కేటీఆర్
  • అణిచివేత, అప్రజాస్వామిక చర్యలకు రాష్ట్రంలో చోటు లేదని నిరూపించిందని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెబుదామని పిలుపు
క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ప్రజాస్వామ్య జయకేతనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ఆ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుందని అన్నారు. ఇది హర్షణీయమని పేర్కొన్నారు. అణిచివేత, అప్రజాస్వామిక చర్యలకు రాష్ట్రంలో చోటులేదని ఈ తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు.

విజయం సాధించిన ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపు కోసం కృషి చేసిన బాల్క సుమన్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

"అడ్డదారుల్లో ఈ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నా. క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సీపీఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం" అన్నారు.

అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయని అన్నారు.

అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దామని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగున ధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు.
Advertisement
KTR
K Taraka Rama Rao
BRS party
Telangana politics
Kyathanpalli Municipality
Ibrahimpatnam Municipality

More Telugu News