టీ20 ప్రపంచకప్‌లో కొత్త రికార్డు.. బుమ్రాను దాటేసిన అర్ష్‌దీప్ సింగ్

Arshdeep Singh Breaks Bumrahs Record in T20 World Cup
టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును అతను బద్దలుకొట్టాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో సికందర్ రజా, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగాలను ఔట్ చేసిన అర్ష్‌దీప్.. టీ20 ప్రపంచకప్‌లలో తన మొత్తం వికెట్ల సంఖ్యను 35కి పెంచుకున్నాడు. దీంతో ఇప్పటివరకు 33 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న బుమ్రాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (32) మూడో స్థానంలో ఉంటే.. హార్దిక్ పాండ్యా(29), ర‌వీంద్ర జ‌డేజా (22) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో కూడా అర్ష్‌దీప్ 5 మ్యాచ్‌లలో 8 వికెట్లు పడగొట్టి, వరుణ్ చక్రవర్తి (11) తర్వాత రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

వెస్టిండీస్ బ్యాటర్లను నాన్న తిట్టారు.. ఆసక్తికర విషయం చెప్పిన అర్ష్‌దీప్
మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్న వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను తన కుటుంబంతో కలిసి చూశానని చెప్పాడు. "వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టినప్పుడల్లా మా నాన్న 'ఏం ఆడుతున్నారు?' అంటూ కోపంతో తిట్టడం మొదలుపెట్టారు. నేను ఆయన్ని శాంతపరిచి, ఆటను ఆస్వాదించమని, దక్షిణాఫ్రికా గెలవాలని ప్రార్థించమని చెప్పాను" అని అర్ష్‌దీప్ వివరించాడు.

ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలవడంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. దీంతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్ భారత్‌కు కీల‌కంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు సెమీ ఫైనల్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
Go Back to Shorts
Arshdeep Singh
T20 World Cup
Jasprit Bumrah
Indian Cricket Team
Most Wickets
Zimbabwe
T20 Records
Ravichandran Ashwin
Hardik Pandya
West Indies

More Telugu News