Asif Nazrul: టీ20 వరల్డ్ కప్ బాయ్‌కాట్‌పై మాటమార్చిన బంగ్లాదేశ్

Asif Nazrul Bangladesh U Turn on T20 World Cup Boycott
  • ఆటగాళ్లు, బోర్డు నిర్ణయమంటూ తొలుత ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు
  • ఒక్కరోజులోనే యూటర్న్.. అది ప్రభుత్వ నిర్ణయమేనని కొత్త ప్రకటన
  • సిద్ధంగా లేకుండా మాట్లాడటం వల్లే గందరగోళం ఏర్పడిందని వివరణ
  • భద్రతా కారణాలతోనే భారత్‌లో ఆడటం లేదని పునరుద్ఘాటన
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడల సలహాదారు డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ యూటర్న్ తీసుకున్నారు. ప్రపంచకప్‌ను బహిష్కరించాలనేది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆటగాళ్ల నిర్ణయమని చెప్పిన ఆయన, 24 గంటలు గడవకముందే మాట మార్చారు. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని బుధవారం స్పష్టత ఇచ్చారు.

మంగళవారం నాడు ఆసిఫ్ నజ్రుల్ మీడియాతో మాట్లాడుతూ "దేశ గౌరవాన్ని కాపాడేందుకు బీసీబీ, ఆటగాళ్లు ఈ త్యాగం చేశారు. వారే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు.

"భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ప్రపంచకప్ ఆడకూడదనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ విషయంలో నేను మొదటి నుంచి స్థిరంగా ఉన్నాను. సరిగా సిద్ధం కాకుండా మాట్లాడటం వల్ల నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ గందరగోళంపై నా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నాను" అని నజ్రుల్ తన పోస్టులో తెలిపారు. "ప్రపంచకప్ ఆడకూడదనేది ప్రభుత్వ నిర్ణయమని నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌లో తమకు భద్రతపై ఆందోళనలు ఉన్నాయని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ తొలుత ఐసీసీని కోరింది. ఐసీసీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నారు. అయితే, టోర్నీ నుంచి వైదొలిగినందుకు బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక లేదా ఇతర ఆంక్షలు విధించబోమని ఐసీసీ హామీ ఇచ్చింది.
Asif Nazrul
Bangladesh
T20 World Cup
T20 World Cup boycott
Bangladesh Cricket Board
BCB
ICC
India security concerns
Scotland cricket team

More Telugu News