Balochistan: బలూచిస్థాన్‌లో రక్తపాతం: ఒకేసారి 12 నగరాలపై ఉగ్ర దాడులు.. 80 మంది మృతి!

Balochistan Terrorist Attacks Kill 80 in Multiple Cities
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. శుక్రవారం రాత్రి మొదలైన ఈ దాడులు శనివారం వరకు కొనసాగాయి. క్వెట్టా, గ్వాదర్, మక్రాన్ వంటి 12 ప్రధాన పట్టణాల్లో భద్రతా బలగాలు, పోలీస్ స్టేషన్లు, సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడులను తిప్పికొట్టే క్రమంలో పాక్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 70 మంది ఉగ్రవాదులు హతమవగా, 10 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

నిషేధిత సంస్థ 'బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ' (బీఎల్ఏ) ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. తమ 'ఆపరేషన్ హెరోఫ్' రెండో దశలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. నుష్కీలోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ హెడ్ క్వార్టర్స్‌ను, ఫ్రాంటియర్ కార్ప్స్ స్థావరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించినప్పటికీ, పాక్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. నసీరాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై అమర్చిన బాంబులను భద్రతా దళాలు గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

బలూచిస్థాన్‌లో కొన్నేళ్లుగా తీవ్రవాద హింస విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది ప్రావిన్స్‌లో మరణాల సంఖ్య 22 శాతం పెరగగా, 2025లో పాకిస్థాన్ అంతటా ఉగ్ర దాడుల తీవ్రత 34 శాతం మేర పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజా దాడుల్లో హతమైన వారిలో కేవలం బలూచ్ తిరుగుబాటుదారులే ఉన్నారా లేక నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సభ్యులు కూడా ఉన్నారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడుల నేపథ్యంలో బలూచిస్థాన్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. గ్వాదర్ పోర్ట్ సిటీలో పౌరులపై జరిగిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. సైన్యం ప్రస్తుతం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. 
Go Back to Shorts
Balochistan
Balochistan attack
Pakistan terrorism
BLA
Balochistan Liberation Army
Quetta
Gwadar
Makran
Terrorist attack in Pakistan
Operation Herof

More Telugu News