ఢిల్లీలో నకిలీ మొబైల్ ఫోన్ల తయారీ ముఠా గుట్టురట్టు.. 1800 ఫోన్లు స్వాధీనం
- పాత ఫోన్ల మదర్బోర్డులతో కొత్త ఫోన్లను అసెంబుల్ చేస్తున్న ముఠా
- ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఐఎంఈఐ నంబర్లను మార్చి మార్కెట్లో అమ్మకాలు
- ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. పాత సామాన్ల వ్యాపారుల నుంచి పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి, వాటిలోని మదర్బోర్డులను వేరుచేసేవారని సెంట్రల్ డీసీపీ నిధిన్ వల్సన్ తెలిపారు. చైనా నుంచి కొత్త మొబైల్ బాడీలను దిగుమతి చేసుకుని, పాత మదర్బోర్డులతో కలిపి కొత్త ఫోన్లుగా అసెంబుల్ చేసేవారని వివరించారు. అనంతరం "WRITEIMEI 0.2.2" అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను మార్చేసేవారని చెప్పారు. ఈ దందాను గత రెండేళ్లుగా కొనసాగిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు.
కరోల్ బాగ్లోని బీదన్పురా ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలపై సుమారు 15 రోజులుగా నిఘా ఉంచిన పోలీసులు, కచ్చితమైన సమాచారంతో ఈ యూనిట్పై దాడి చేశారు. పోలీసులు లోపలికి ప్రవేశించేసరికి నిందితులు ల్యాప్టాప్ సాయంతో ఫోన్లను అసెంబుల్ చేస్తూ, ఐఎంఈఐ నంబర్లను మారుస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఈ దాడిలో 1,826 కీప్యాడ్, స్మార్ట్ఫోన్లు, ఐఎంఈఐ మార్చే సాఫ్ట్వేర్తో ఉన్న ల్యాప్టాప్, స్కానింగ్ పరికరం, వేలాది మొబైల్ విడిభాగాలు, ముద్రించిన ఐఎంఈఐ లేబుళ్లను పోలీసులు సీజ్ చేశారు. వారిపై బీఎన్ఎస్, ఐటీ చట్టం, టెలికం చట్టం 2023 కింద కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ వెనుక ఉన్న సరఫరా చైన్, చైనా నుంచి విడిభాగాల కొనుగోలు, పంపిణీ నెట్వర్క్పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.