ఏపీలో పెట్టుబడుల సునామీ... సెమీకండక్టర్ల నుంచి షిప్ యార్డ్ వరకు కీలక ఒప్పందాలు

Nara Lokesh Attracts Investment Boom for Andhra Pradesh
  • ఏపీలో సెమీకండక్టర్, చిప్ డిజైనింగ్ యూనిట్ ఏర్పాటుకు సిలికాన్ జెన్ కు ఆహ్వానం
  • క్వాంటం టెక్నాలజీలో దేశానికి ఏపీ మార్గదర్శనం చేస్తుందన్న మంత్రి లోకేశ్
  • రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గోవా షిప్ యార్డ్స్ సుముఖత
  • అమరావతిలో 12 ఎకరాల్లో ఏఐఎఫ్ఎఫ్ ఫుట్ బాల్ స్టేడియం నిర్మాణం
  • పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు జెలెస్ట్రా పవర్ కు విజ్ఞప్తి
  • శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఏఏఐ, ఏపీఏడీసీ మధ్య కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలో నడిపించేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం వేదికగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. 

మరోవైపు, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరడం విశేషం.

టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టే దిశగా...

క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉందని మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో 'ఆత్మనిర్భర్ క్వాంటం' అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఏదైనా అమలు చేయాలంటే ముందు ఒక కల ఉండాలి. మేం కేవలం కలలు కనడమే కాదు, వాటిని సాకారం కూడా చేస్తాం. అందుకే దేశంలోనే తొలిసారిగా క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించాం" అని అన్నారు. 

అమరావతిలో ఏర్పాటు చేయనున్న 'క్వాంటం వ్యాలీ'కి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయని, అవి.. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ప్రతిభావంతులైన ఎకోసిస్టమ్ నిర్మాణం, హార్డ్‌వేర్ తయారీ అని వివరించారు. 

ఈ కార్యక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ (2025-30)ని విడుదల చేశారు. అనంతరం క్వాంటం టెక్నాలజీ రంగంలో 23 సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి.

ఇదే క్రమంలో, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, సెమీకండక్టర్ల తయారీలో ప్రసిద్ధిగాంచిన సిలికాన్ జెన్ సంస్థ చైర్మన్ చీదా చిదంబరంతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) యూనిట్, చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ఐటీ, సెమీకండక్టర్స్ పాలసీ 2.0 దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. 

దీనిపై చిదంబరం సానుకూలంగా స్పందిస్తూ, AI GPUలు, CPUలు, హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) వంటి అధునాతన భాగాల తయారీపై తమకు ఆసక్తి ఉందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

గోవా షిప్ యార్డ్స్ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ వాసుదేవన్‌తో మంత్రి లోకేశ్ భేటీ

రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడంలో భాగంగా గోవా షిప్ యార్డ్స్ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ వాసుదేవన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏపీలో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ & రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు సంస్థను అభినందించారు. దీని ద్వారా సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆదికేశ్ తెలిపారు. భారత నావికాదళం, తీర రక్షక దళానికి తమ సంస్థ సేవలు అందిస్తోందని, 1057 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతం ఉన్న ఏపీలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు.

అలాగే, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు జెలెస్ట్రా పవర్ సీఈఓ పరాగ్ శర్మతో లోకేశ్ భేటీ అయ్యారు. సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్ భాగాలు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కోసం ఏపీలో ఒక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోర్టుకు సమీపంలో యూనిట్ ఏర్పాటు చేస్తే ఎగుమతులకు సులభంగా ఉంటుందని సూచించారు. రాష్ట్రంలో ఉన్న విశాలమైన తీరప్రాంతం, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ, త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

అమరావతిలో ఫుట్‌బాల్ స్టేడియం

పారిశ్రామిక రంగంతో పాటు క్రీడారంగ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) చైర్మన్ కల్యాణ్ చౌబేతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. అమరావతిలో 12 ఎకరాల విస్తీర్ణంలో AIFF ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించనున్నట్లు చౌబే ప్రకటించారు. అంతేకాకుండా, పాఠశాల స్థాయి నుంచి ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు పీఈటీలకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖతో కలిసి పనిచేస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటీవల డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో 3 శాతం రిజర్వేషన్ కల్పించామని మంత్రి గుర్తుచేశారు.

శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APADC) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్రలో కనెక్టివిటీ పెరిగి పర్యాటక, ఆర్థిక రంగాలు అభివృద్ధి చెందుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh investments
AP industrial development
Srikakulam airport
Quantum technology AP
Semiconductor manufacturing AP
Shipbuilding complex AP
Renewable energy AP
Amaravati football stadium
AP IT policy

More Telugu News