Advertisement

నైజీరియాలో కలరా విజృంభణ.. బొర్నో రాష్ట్రంలో 200 మంది మృతి!

Cholera outbreak in Nigeria 200 dead in Borno state
  • గడిచిన రెండు నెలల్లో తీవ్రస్థాయికి చేరిన కలరా మహమ్మారి
  • 35,500కి పైగా కలరా అనుమానిత కేసులు
  • సురక్షిత తాగునీరు, పారిశుధ్యం లేకపోవడమే కారణమన్న ఎంఎస్ఎఫ్
  • అత్యవసర చర్యలు చేపట్టిన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు
  • డ్యామ్‌లు, రిజర్వాయర్లపై ప్రభుత్వం  ఆంక్షలు 
  • ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా
నైజీరియాలోని ఈశాన్య రాష్ట్రమైన బొర్నోలో కలరా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. గత రెండు నెలల వ్యవధిలోనే ఈ వ్యాధి బారిన పడి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ వైద్య సేవా సంస్థ 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' (ఎంఎస్ఎఫ్) ఒక ప్రకటనలో వెల్లడించింది. స్థానిక బొర్నో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జులై 12 నాటికి కనీసం 198 మంది మరణించగా, 35,500 కంటే ఎక్కువ అనుమానిత కేసులు నమోదైనట్లు సంస్థ పేర్కొంది. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో స్థానిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు బాధితులతో నిండిపోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఎంఎస్ఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ వ్యాధి తీవ్రస్థాయిలో వ్యాపించడానికి ప్రధానంగా బాధితులు నివసిస్తున్న ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటి వసతి లేకపోవడం, పారిశుధ్య లోపం, అరకొర వైద్య సదుపాయాలు ఉండడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో కురిసిన భారీ వర్షాలు, తదనంతరం సంభవించిన వరదల వల్ల కలరా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ముందస్తుగా 10 రాష్ట్రాలను అప్రమత్తం చేసినప్పటికీ, ప్రస్తుతం బొర్నో ప్రాంతంలో పరిస్థితి చెయ్యిదాటిపోతోంది. ప్రస్తుతం నైజీరియా ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యునిసెఫ్, ఎంఎస్ఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగి బాధితులకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నాయి.

స్థానిక ప్రభుత్వం తక్షణ అత్యవసర చర్యలను అమలులోకి తెచ్చింది. కలుషితం అయ్యే అవకాశం ఉన్న స్థానిక డ్యామ్‌లు, జలాశయాల నీటి వినియోగంపై ఆంక్షలు విధించింది. వీటికి ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తోంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకే ఈ తీవ్రమైన విరేచన వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం అందించకపోతే కొన్ని గంటల్లోనే ప్రాణాంతకంగా మారుతుందని, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచకపోతే ఈ వ్యాధిని అదుపు చేయడం పెద్ద సవాలుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Nigeria
Borno State
Cholera Outbreak
Doctors Without Borders
MSF Health Crisis
Nigeria Death Toll

More Telugu News