ఏపీ మంత్రి లోకేశ్ పేరుతో సైబర్ నేరానికి పాల్పడిన కేసులో మరో ఇద్దరి అరెస్టు

Nara Lokesh Cyber Crime Case Two More Arrested
  • టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌గా నమ్మించి ఆర్థిక సాయం పేరుతో వల
  • రెమిటెన్స్ ఛార్జీలంటూ బాధితుల నుంచి రూ.54.34 లక్షల వసూలు
  • హైదరాబాద్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు
  • ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ జనవరిలో అరెస్ట్
  • ఏపీ, తెలంగాణలో ఈ ముఠాపై మొత్తం 9 కేసుల నమోదు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చిత్రాన్ని వాట్సప్ డీపీగా పెట్టుకుని, టీడీపీ ఎన్నారై కన్వీనర్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాలోని మరో ఇద్దరు సభ్యులను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో బుధవారం నిందితులైన గుత్తికొండ సాయి శ్రీనాథ్ (ఏ-2), చిత్తడి తల సుమంత్‌ను (ఏ-3) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కొండూరి రాజేశ్ ‌ను ఈ ఏడాది జనవరి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 9 కేసుల్లో రూ.54.34 లక్షలు కొల్లగొట్టినట్లు అధికారులు తెలిపారు.

ఆర్థిక సాయం పేరుతో ఇలా మోసం

నిందితులు రాజేశ్, సాయి శ్రీనాథ్, సుమంత్ ఒక ముఠాగా ఏర్పడి సైబర్ మోసాలకు పాల్పడ్డారు. వీరు 'ఎక్స్' (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో #HelpAtNaraLokesh, #HelpAtPawanKalyan వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టి, వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అవసరమైన వారి వివరాలు సేకరించేవారు. అనంతరం అమెరికా నంబర్‌లా కనిపించే వర్చువల్ నంబర్‌తో బాధితులకు వాట్సప్‌లో సందేశాలు పంపేవారు.

కొండూరి రాజేశ్ తనను తాను టీడీపీ ఎన్నారై కన్వీనర్‌గా పరిచయం చేసుకుని, మంత్రి లోకేశ్ ఫొటోను తన వాట్సప్ డీపీగా పెట్టుకునేవాడు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని నమ్మించి, నకిలీ బ్యాంకు క్రెడిట్ రసీదులు పంపి డబ్బు పంపినట్లు నమ్మించేవాడు. కొన్ని రోజుల తర్వాత బ్యాంకు మేనేజర్లమని ఫోన్లు చేసి, విదేశాల నుంచి వచ్చిన ఆ డబ్బు వారి ఖాతాలో జమ కావాలంటే 4 శాతం రెమిటెన్స్ ఛార్జీలు చెల్లించాలని చెప్పేవారు. వారి మాటలు నమ్మిన బాధితులు, నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేవారు. ఈ మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్ 1930కి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి.

10 నెలలుగా నిఘా పెట్టి అరెస్ట్

ప్రధాన నిందితుడు కొండూరి రాజేశ్ జనవరిలో అరెస్ట్ కావడానికి ముందు గోవా, అండమాన్, ఉత్తర్‌ప్రదేశ్ మీదుగా నేపాల్‌కు పారిపోయాడు. అక్కడి నుంచే నేరాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, 15 రోజుల పాటు రెక్కీ నిర్వహించి అతడిని అరెస్ట్ చేశారు. రాజేశ్ అరెస్ట్ కావడంతో సాయి శ్రీనాథ్, సుమంత్ ఫోన్లు, సిమ్‌కార్డులు మార్చేసి పరారయ్యారు. గత 10 నెలలుగా వారి కదలికలపై నిఘా పెట్టిన సీఐడీ అధికారులు, ఎట్టకేలకు నిన్న హైదరాబాద్‌లో వారిని అరెస్ట్ చేశారు. 
Go Back to Shorts
Nara Lokesh
AP CID
Cyber Crime
TDP NRI
Online Fraud
Financial Scam
WhatsApp DP
Konduri Rajesh
Guttikonda Sai Srinath
Chittadi Thala Sumanth

More Telugu News