భారత్తో మ్యాచ్: పాక్ మహిళా క్రికెటర్పై ఐసీసీ కొరడా
- ఔటైన తర్వాత ఆగ్రహంతో బ్యాట్ను పిచ్కేసి కొట్టిన సిద్రా
- ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నిర్ధారణ
- అధికారిక మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జారీ
ఆదివారం ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జట్టు తడబడింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో 40వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత బౌలర్ స్నేహ్ రాణా బౌలింగ్లో సిద్రా అమీన్ అవుటైంది. అయితే, పెవిలియన్కు వెళ్లే క్రమంలో తీవ్ర నిరాశకు గురైన ఆమె, తన చేతిలోని బ్యాట్ను ఆగ్రహంతో గట్టిగా పిచ్కేసి కొట్టింది. ఇది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం 'క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం' కిందకు వస్తుందని ఐసీసీ పేర్కొంది.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 88 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సిద్రా అమీన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసి తన జట్టులో టాప్ స్కోరర్గా నిలిచింది.
ఆన్-ఫీల్డ్ అంపైర్లు లారెన్ ఏజెన్బాగ్, నిమాలి పెరీరా, థర్డ్ అంపైర్ కెరిన్ క్లాస్టే, ఫోర్త్ అంపైర్ కిమ్ కాటన్ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఎమిరేట్స్ ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్ ప్రతిపాదించిన శిక్షను సిద్రా అమీన్ అంగీకరించింది. దీంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ ప్రక్రియ ముగిసింది. గత 24 నెలల కాలంలో ఆమెకు ఇదే మొదటి తప్పిదం కావడం గమనార్హం. సాధారణంగా లెవెల్ 1 ఉల్లంఘనలకు అధికారిక మందలింపు నుంచి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత వరకు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.