Sirisha: కుప్పంలో అమానుషం: భర్త చేసిన అప్పుకు భార్యను చెట్టుకు కట్టేసి దాడి.. వీడియో ఇదిగో!

Woman Tied to Tree and Attacked in Kuppam Over Husbands Debt
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలోని నారాయణపురంలో నిన్న సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భర్త తీసుకున్న అప్పు చెల్లించలేదన్న నెపంతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప కొంతకాలం క్రితం గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య శిరీష, తన పుట్టిల్లయిన శాంతిపురం మండలం కెంచనబళ్లకు వెళ్లి, బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ తన కుమారుడిని పోషించుకుంటోంది.

ఈ క్రమంలో, సోమవారం తన కుమారుడి టీసీ తీసుకునేందుకు శిరీష నారాయణపురంలోని పాఠశాలకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి ఆమెను అడ్డగించారు. భర్త తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలంటూ శిరీషతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం, ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సమీపంలోని ఒక చెట్టుకు కట్టేసి దాడి చేశారు. తల్లిని కొడుతుంటే కొడుకు ఏడుస్తున్న శబ్దం వీడియోలో వినిపిస్తోంది.

ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, చెట్టుకు కట్టి ఉన్న శిరీషను విడిపించి రక్షించారు. బాధితురాలు శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునికన్నప్ప, మునెమ్మ, రాజా, జగదీశ్వరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త చేసిన అప్పు కోసం భార్యను ఇలా హింసించడం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Go Back to Shorts
Sirisha
Kuppam
Andhra Pradesh
Loan Harassment
Debt
Chittoor District
Munikannappa
Crime
Wife Assault
Narayana Puram

More Telugu News