కేంద్ర జల సంఘం ఛైర్మన్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
- మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చ
- కృష్ణాపై టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు వెల్లడి
- పాలమూరుకు 45, సమ్మక్క-సారక్కకు 44 టీఎంసీల కేటాయింపునకు విజ్ఞప్తి
- పోలవరం బ్యాక్ వాటర్ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. బ్యారేజీ మరమ్మతులు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలసంఘం ఛైర్మన్కు వివరించారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, డిజైన్లో స్పష్టమైన లోపాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లో ఒక ప్రాంతంలో నిర్మిస్తామని ప్రతిపాదించి, ఆచరణలో మరోచోట నిర్మాణం చేపట్టారని మంత్రి తెలిపారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు సీడబ్ల్యూసీలో సమగ్రంగా చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని, ఈ అంశంపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రజాధనం ఏమాత్రం వృథా కాకుండా చూస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కృష్ణా నదిపై టెలిమెట్రీల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన నిధులను ఇప్పటికే కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అందజేసినట్లు మంత్రి ఈ సందర్భంగా కేంద్ర జలసంఘం ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి విడతకు 45 టీఎంసీల నీటిని, అలాగే సమ్మక్క-సారక్క బ్యారేజీకి 44 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణ భూభాగంలో ఎదురయ్యే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.