విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'... తాజా అప్డేట్ ఇదిగో!
- విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో 'కింగ్డమ్'
- ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్లు చిత్రబృందం ప్రకటన
- సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడి
- మే 30న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. 'కింగ్డమ్' డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే తొలి సగం పూర్తయిందని సితార ఎంటర్టైన్మెంట్స్ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ద్వయం మే 30న థియేటర్లలో ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్కు విశేషమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే కోటి వ్యూస్ దాటి రికార్డు సృష్టించింది. టీజర్లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని రగ్డ్ లుక్లో, సిక్స్ ప్యాక్తో కనిపించి ఆకట్టుకున్నారు. 'ద్రోహం నీడల నుంచి ఓ రాజు ఉదయిస్తాడు' అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ ఘట్టాలు ఉంటాయని టీజర్ స్పష్టం చేసింది. జైలు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నీరజ కోన కాస్ట్యూమ్స్ డిజైనర్గా, విజయ్ బిన్ని కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం యాన్నిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ వంటి స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి కావడంతో, సినిమా మిగతా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.