Riyan Parag: కోచ్ గౌతమ్ గంభీర్‌పై రియాన్ పరాగ్ ప్రశంసలు

Riyan Parag revealed how head coach Gautam Gambhir prepared him for different situations in the match
  • గంభీర్ విభిన్న పరిస్థితులకు అనుగుణంగా జట్టును సిద్ధం చేశాడన్న యువ క్రికెటర్
  • కేవలం 1.2 ఓవర్లలో 3 వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ 
  • శ్రీలంకపై మొదటి టీ20 మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు
కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో శనివారం రాత్రి భారత్ తొలి విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఒకానొక స్థితిలో శ్రీలంక పటిష్టమైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ చేజారుతున్న సమయంలో భారత ఆటగాళ్ల అద్భుతంగా పుంజుకున్నారు. ముఖ్యంగా యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ సంచలన బౌలింగ్ చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బంతిని అందించగా... రియాన్ పరాగ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 

బౌలింగ్ లో రియాన్ పరాగ్ చెలరేగాడు. 1.2 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు ఇచ్చి 3 ముఖ్యమైన వికెట్లు తీశాడు. ముఖ్యమైన కమిందు మెండిస్, మహేశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక వికెట్లను తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తొలి వికెట్‌కు 84 చక్కటి ఆరంభాన్ని అందుకున్న శ్రీలంక...  పరాగ్ విజృంభనతో 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ జయకేతనం ఎగురవేసింది. 

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ పరాగ్ మ్యాచ్ అనంతరం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. విభిన్న పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా సిద్ధం కావాలో కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడని పేర్కొన్నారు.

తనకు బౌలింగ్ అంటే చాలా ఇష్టమని, నెట్స్‌లో వీలైనంత ఎక్కువగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటానని పరాగ్ వెల్లడించాడు. ఎక్కడ బౌలింగ్ చేయాలి, ఎలా బౌలింగ్ చేయాలనే అంశాలపై నెట్స్‌లో చాలా చర్చలు జరిగేవని, గౌతమ్ సర్‌ కూడా తనతో అలాంటి కసరత్తులు చేయించాడని వివరించాడు. బంతి స్పిన్ అవుతున్నప్పుడు 16వ, 17వ ఓవర్లలో బౌలింగ్ చేయాల్సి వస్తే తాను ఏం చేయాలో గంభీర్ చెప్పినట్టు వివరించాడు. స్టంప్స్‌కు బౌలింగ్ చేయడమే తన పనని, బంతి కూడా టర్న్ అయిందని రియాన్ పరాగ్ వివరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రియాన్ పరాగ్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ ఆ వీడియోలో మాట్లాడుకోవడం చూడొచ్చు.
Riyan Parag
Gautam Gambhir
Cricket
India vs Srilanka

More Telugu News