బెంగళూరు వీధుల్లో సామాన్యురాలిగా బ్రిటన్ ప్రధాని భార్య, పిల్లలు.. వీడియో ఇదిగో!

UK First Lady Akshata Murty Checks Out Books In Bengaluru
  • రాఘవేంద్ర మఠం వద్ద బుక్స్ కొనుగోలు చేసిన అక్షతా మూర్తి
  • కూతురు, మనవరాళ్ల వెంట వచ్చిన నారాయణమూర్తి
  • బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య సింప్లిసిటీని మెచ్చుకుంటున్న నెటిజన్లు
ఓ దేశ ప్రధానికి భార్య, పలు కంపెనీలకు అధినేత అయినా సామాన్యురాలిగా జనంలో కలిసిపోయింది.. ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన షాపులో పుస్తకాలు కొనుగోలు చేసింది. సెక్యూరిటీ హడావుడి లేకుండా తండ్రితో పాటు పిల్లలను వెంట తీసుకుని బెంగళూరులో షాపింగ్ చేసింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి బెంగళూరు వీధుల్లో సామాన్యురాలిగా కలిసిపోవడంతో ఎవరూ గుర్తుపట్టలేదు. అయితే, ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అక్షతా మూర్తి సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఇటీవల తల్లిదండ్రులను చూసేందుకు అక్షతా మూర్తి బెంగళూరు వచ్చారు. పిల్లలతో కలిసి ఇండియాలో పర్యటిస్తున్నారు. తాజాగా సిటీలోని రాఘవేంద్ర మఠం వద్ద తండ్రీ, పిల్లలతో కలిసి కనిపించారు. రోడ్డు పక్కనే ఏర్పాటు చేసిన పుస్తకాల షాపులో మంచి పుస్తకాల కోసం వెదకడం ఈ వీడియోలో కనిపించింది. చుట్టుపక్కల సెక్యూరిటీ హడావుడి లేకపోవడం, మిగతా జనం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పనులు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. 

సెలబ్రెటీ వచ్చారనే హడావుడి ఏమీ కనిపించక పోవడం చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. నిజానికి అక్కడున్న వారిలో చాలామంది అక్షతా మూర్తిని గుర్తించలేదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. కాగా, ఈ నెల మొదట్లోనూ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణ మూర్తితో కలిసి సిటీలోని ఓ ఐస్ క్రీమ్ షాపులో కనిపించారు. దీంతో నారాయణ మూర్తి కుటుంబ సభ్యుల సింప్లిసిటీ చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Go Back to Shorts
Akshata Murty
UK First Lady
Rishi Sunak
Britan PM
Bengaluru
Narayana Murthy
Infosys

More Telugu News