అందువల్లే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నాడని తెలిసింది: నారా లోకేశ్

Nara Lokesh said Jagan likely go to early elections
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • శ్రీరామవరంలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి
  • పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసేది టీడీపీయేనన్న లోకేశ్
  • జగన్ పనైపోయిందంటూ వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 198వ రోజు చింతలపూడి నియోజకవర్గం తీగలవంచ నుంచి ప్రారంభమైన పాదయాత్ర పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం, గురవాయిగూడెం, ఏపిగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, వెంకటాపురం మీదుగా బొర్రంపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. ఇవాళ లోకేశ్ శ్రీరామవరంలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 

ముఖాముఖిలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్ 

  • పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే. నిర్వాసితులకు న్యాయంచేసేది టీడీపీనే.
  • పోలవరం నిర్వాసితులకు 2017 సర్వే ప్రకారం పరిహారం చెల్లిస్తాం.
  • చంద్రబాబు హయాంలో 72 శాతం పనులు పూర్తిచేశారు. 1.15 లక్షల ప్యాకేజిని రూ.6.36 లక్షలకు పెంచింది చంద్రబాబు. 
  • 4 వేల కోట్లు నిర్వాసితులకు ప్యాకేజ్, పునరావాసం కోసం ఖర్చు చేసింది చంద్రబాబు.
  • కేంద్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని కేంద్రాన్ని ఒప్పించి పనులు వేగవంతం చేసింది చంద్రబాబు. 
  • జగన్ ముందు 19 లక్షల ప్యాకేజ్ అన్నాడు, ఆ తరువాత 10 లక్షలు అన్నాడు, వైఎస్ గారి హయాంలో జరిగిన భూసేకరణకి అదనంగా 5 లక్షలు ఇస్తానని అన్నాడు. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు కేంద్రం బటన్ నొక్కితేనే నిర్వాసితులకు డబ్బులు అంటున్నాడు. 
  • జగన్ పనైపోయింది... పోలవరం నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వడు, ఇళ్లు కట్టడు. ఈ మధ్య ఐ ప్యాక్ వాళ్ళు జగన్ కి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం మరో ఆరు నెలలు పోతే సింగిల్ డిజిట్ అని చెప్పారు. అందుకే జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళబోతున్నాడు అని సమాచారం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్దం.
  • జగన్ నాలుగేళ్లలో కేవలం 4 శాతం పనులు పూర్తి చేశాడు. జగన్ రివర్స్ టెండర్ విధానం వలన పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడింది. ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోయి పోలవరం నిర్వాసితులను మోసం చేశాడు. 
  • బుల్లెట్ దిగుతుంది అన్న మంత్రికే బుల్లెట్ దిగింది. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఇప్పుడున్న మంత్రిని అడిగితే అరగంట అంటున్నాడు!
  • చంద్రబాబుది పోలవరం రేంజ్... జగన్ ది మురికి కాలువ రేంజ్! ఆర్ అండ్ అర్ ప్యాకేజ్ కింద ఇచ్చే డబ్బులు కూడా వైసీపీ వాళ్లు కొట్టేశారు. దొంగ కాగితాలు సృష్టించి నిర్వాసితులకు రావాల్సిన వందల కోట్లు వైసీపీ నేతలు కొట్టేశారు. 
  • టీడీపీ హయాంలో ప్రాజెక్టు ఖర్చు పెరిగింది అని జగన్ అసత్య ప్రచారం చేశాడు. ఆ రోజు పెరిగింది ప్రాజెక్ట్ వ్యయం కాదు. భూమి ఇచ్చిన గిరిజనులు, గిరిజనేతరులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలి అనుకున్నాం. అందుకే ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది.
  • జగన్ కేసుల విషయంలో తప్ప పోలవరం విషయంలో ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లలేదు. అవినీతి కోసం జగన్ ప్రభుత్వం రీసర్వే చేసింది. నిర్వాసితుల డబ్బు తిన్న వైసీపీ నేతలపై విచారణ చేసి డబ్బు కక్కిస్తాం.
బజ్జీల దుకాణదారుతో లోకేశ్ మాటామంతీ!

పోలవరం నియోజకవర్గం బొర్రంపాలెంలో పాదయాత్ర సందర్భంగా బజ్జీల దుకాణం నిర్వహిస్తున్న గొడుగు లక్ష్మి అనే మహిళతో లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా లక్ష్మీ తమ కష్టాలను చెబుతూ టీడీపీ హయాంలో తనకు ఇల్లు మంజూరైందని వెల్లడించింది. అయితే, ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదని తెలిపింది. గ్యాస్, కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని, చాలీచాలని ఆదాయంతో బతుకుబండి లాగడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తంచేసింది.

నారా లోకేశ్ స్పందిస్తూ...

మీ లాంటి మహిళల కోసమే చంద్రబాబునాయుడు మహాశక్తి కార్యక్రమాన్ని రూపొందించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 

పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు ఉమశమనం కలిగిస్తాం. లక్ష్మి ఇంటితో సహా పేదల పక్కా ఇళ్లకు సంబంధించి బకాయిలన్నీ చెల్లిస్తాం. మీకోసం పని చేసే చంద్రబాబును సీఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2669.2 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 22.5 కి.మీ.*

*199వరోజు (30-8-2023) యువగళం వివరాలు*

*చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*

ఉదయం

8.00 – బొర్రంపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – మల్లుకుంట్లలో స్థానికులతో మాటామంతీ.

10.15 – పాదయాత్ర చింతలపూడి అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం.

10.20 – రావికంపాడు క్రాస్ రోడ్డు వద్ద స్థానికులతో మాటామంతీ.

10.50 – రావికంపాడులో స్థానికులతో సమావేశం.

11.20 – దేవలంపల్లిలో మత్స్యకారులతో సమావేశం.

మధ్యాహ్నం

12.05 – పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేవద్ద రైతులతో సమావేశం.

1.35 – గురవాయిగూడెంలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – గురవాయిగూడెం నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.00 – జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలో స్థానికులతో మాటామంతీ.

5.20 – జంగారెడ్డిగూడెం ఆటోనగర్ లో లాయర్లతో సమావేశం.

5.35 – జంగారెడ్డిగూడెం బస్టాండు వద్ద హమాలీ వర్కర్లతో సమావేశం.

5.50 – జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

రాత్రి

7.35 – జంగారెడ్డిగూడెం బైపాస్ లో పొగాకు రైతులతో సమావేశం.

8.50 – దండమూడి కళ్యాణమండపం వద్ద విడిది కేంద్రంలో బస.

******
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Early Elections
Polavaram Project
Eluru District
Yuva Galam Padayatra
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News