Perni Nani: మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం అంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగింది: పేర్ని నాని

  • అధికారం కోసం చంద్రబాబు ఏమైనా మాట్లాడతాడని వెల్లడి
  • టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు సుత్తి కబుర్లు చెబుతున్నాడని వ్యంగ్యం
  • దేశంలోనే సంపన్న రాజకీయవేత్త చంద్రబాబేనన్న పేర్ని నాని 
Perni Nani take a jibe at Chandrababu speech

టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం అంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగిందని విమర్శించారు. అధికారం కోసం తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. 

సంపద గురించి చెబుతున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి తడ వరకు ఏమి సంపద సృష్టించారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి అప్పులు తప్ప ఒరిగిందేమీ లేదని అన్నారు. వయసు పైబడిన లక్షణాలు చంద్రబాబులో కనపడుతున్నాయని, టీడీపీ కార్యకర్తలకు సుత్తి మాటలు చెబుతున్నాడని వ్యాఖ్యానించారు. 

అసలు, సైకిల్ గుర్తు సృష్టికర్త ఎవరు... అని పేర్ని నాని నిలదీశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు హస్తం పార్టీ నీడలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. సైకిల్ కు కరెంటు పెడితే దూసుకుని పోతుందని చంద్రబాబు అంటున్నాడని, ఎప్పటికైనా సైకిల్, మోటార్ సైకిల్ ఒకటి అవుతాయా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇది ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు దొంగిలించిన సైకిల్ అని పేర్ని నాని విమర్శించారు. 

సీఎం జగన్ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనికుడైన రాజకీయ నాయకుడు అని తెలిపారు. చంద్రబాబుకు ఆయన తండ్రి ఖర్జూరనాయుడు ఇచ్చిన ఆస్తి ఎంత? అని ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి రూ.1000 కోట్ల ఆస్తి ఎలా సంపాదించావ్? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. 

చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ చూసినా, కుటుంబ సభ్యుల ఆదాయపన్ను రికార్డులు చూసినా ఆయనెంత సంపన్నుడో తెలిసిపోతుందని పేర్ని నాని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేసిన శకుని... ఎన్టీఆర్ ను కూలదోసేందుకు రామోజీరావుతో కలిసి కుట్రలు పన్నారు అంటూ విమర్శించారు.

More Telugu News