మానవత్వం మరచిన కొడుకు.. చనిపోయిన తండ్రి వేలిముద్రతో ఆస్తి కోసం దారుణం!

Mahendra forgets humanity uses dead fathers thumbprint for property
  • చనిపోయిన తండ్రి వేలిముద్ర తీసుకున్న కొడుకు
  • తండ్రిని కుమార్తెలే చూసుకున్నారని కుటుంబం ఆరోపణ
  • ఆస్తిలో కొంత భాగాన్ని ముగ్గురు కుమార్తెలకు తండ్రి ఇచ్చినట్లు సమాచారం
  • కొడుకు, కోడలికి ఆస్తి చెందదని తండ్రి పత్రికా ప్రకటన
  • తండ్రి మృతదేహం వేలిముద్రను ఖాళీ పేపర్లపై తీసుకున్నట్లు ఆరోపణ
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
ఆస్తి కోసం కన్న తండ్రి మృతదేహాన్నే అడ్డంగా పెట్టుకున్నాడో కొడుకు. బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోలేదు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా వదల్లేదు. మృతదేహం వేలిని పట్టుకుని ఖాళీ కాగితాలపై వేలిముద్ర వేయించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకుంది.

75 ఏళ్ల ఛత్రపాల్‌ తన కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మి వేధింపులు భరించలేక కొంతకాలంగా కుమార్తెల వద్ద ఉంటున్నారు. 2023లో మహేంద్ర, లక్ష్మి తన తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఛత్రపాల్‌ కుమార్తె సుమన్‌ ఆరోపించారు. దీంతో ఆయన బంధువుల వద్ద, అనంతరం తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ వచ్చారు.

ఆస్తిని కుమార్తెలకు పంచిన తండ్రి
తనను చూసుకున్న ముగ్గురు కుమార్తెలకు ఛత్రపాల్‌ తనకున్న భూమిని రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనను, తన భార్యను వేధించారనే కారణంతో కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మికి తన ఆస్తిలో ఏమాత్రం చెందదని పత్రికలో ప్రకటన కూడా ఇచ్చినట్లు కుటుంబం తెలిపింది.

అయితే తండ్రి ఆరోగ్యం విషమించడంతో జులై 7న సుమన్‌ తన అన్న మహేంద్రకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబంతో కలిసి లక్నోకు వచ్చిన మహేంద్ర.. తండ్రికి చికిత్స చేయిస్తానంటూ ఆయన్ను గ్రామానికి తీసుకెళ్లాడు. రెండు రోజులకే ఛత్రపాల్‌ కన్నుమూశారు.

తండ్రి చనిపోయినా..
అంత్యక్రియల కోసం సుమన్‌, ఇతర కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడే వారికి ఊహించని దృశ్యం కనిపించింది. మృతిచెందిన ఛత్రపాల్‌ చేతి వేలిని పట్టుకున్న మహేంద్ర.. ఖాళీ కాగితాలపై ఆయన వేలిముద్ర తీసుకుంటున్నట్లు బంధువులు, గ్రామస్థులు చూశారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీయడంతో అది తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తండ్రి బతికున్నప్పుడు ఆయనను పట్టించుకోకుండా ఇంటి నుంచి పంపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారుడు.. చివరికి ఆయన మరణించిన తర్వాత కూడా ఆస్తి కోసం మృతదేహాన్ని ఉపయోగించుకోవడం చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

సుమన్‌ భర్త రమేశ్‌ మాట్లాడుతూ.. మృతదేహం నుంచి వేలిముద్ర తీసుకోవడం చూసి తాము దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. ఖాళీ కాగితాలపై తీసుకున్న ఆ వేలిముద్రలను తర్వాత దేనికి ఉపయోగిస్తారోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్న తండ్రి చివరి శ్వాస ఆగిన క్షణాల్లోనూ ఆస్తి ఆలోచనే.. మానవత్వాన్ని మరిచిన కొడుకు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Mahendra
Chhatrapal
Property dispute
Lucknow Uttar Pradesh
Dead father thumbprint
Viral video

More Telugu News