టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎంపికకు బ్రేక్‌.. కోర్టు మెట్లెక్కనున్న టాటా ట్రస్ట్స్‌?

N Chandrasekaran successor selection hits hurdle as Tata Trusts moves court
  • టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎంపికకు సెలెక్షన్‌ కమిటీ ఏర్పాటు
  • ఎస్‌ఆర్‌టీటీపై ఛారిటీ కమిషనర్‌ ఆంక్షలు
  • కీలక నిర్ణయాల్లో ఎస్‌ఆర్‌టీటీ పాల్గొనలేని పరిస్థితి
  • ఆంక్షలపై న్యాయపరమైన మార్గం అన్వేషిస్తున్న టాటా ట్రస్ట్స్‌
  • అవసరమైతే బాంబే హైకోర్టును ఆశ్రయించే అవకాశం
టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మరోసారి పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడంతో తదుపరి ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియ మొదలైంది. అయితే కొత్త అధినేతను ఎన్నుకునేలోపే టాటా గ్రూప్‌కు ఓ కీలక సమస్య ఎదురైంది. ‘సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌’ (ఎస్‌ఆర్‌టీటీ) కీలక నిర్ణయాల్లో పాల్గొనేలా చేసేందుకు టాటా ట్రస్ట్స్‌ అత్యవసరంగా న్యాయపరమైన మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు ‘ఇండియా టుడే’ తెలిపింది.

మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ విధించిన ఆంక్షల కారణంగా ప్రస్తుతం ఎస్‌ఆర్‌టీటీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో పాల్గొనలేని పరిస్థితి ఉంది. ఇదే ఇప్పుడు టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియకు అడ్డంకిగా మారింది.

సెలెక్షన్‌ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
టాటా సన్స్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ప్రకారం కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు సెలెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ (ఎస్‌డీటీటీ) నిర్ణయించింది. ఈ కమిటీ టాటా సన్స్‌ బోర్డు తదుపరి ఛైర్మన్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై సిఫారసు చేయనుంది.

అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. టాటా ట్రస్ట్స్‌లోని రెండు ప్రధాన ట్రస్టులు-ఎస్‌ఆర్‌టీటీ, ఎస్‌డీటీటీ కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. టాటా సన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కోసం ప్రతినిధిని, అలాగే ఛైర్మన్‌ ఎంపిక కమిటీలోని ముగ్గురు సభ్యులను ఈ రెండు ట్రస్టులు సంయుక్తంగా నామినేట్‌ చేయాల్సి ఉంది.

ఎస్‌ఆర్‌టీటీకి అడ్డంకి ఎందుకు?
మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ విధించిన ఆంక్షల వల్ల ఎస్‌ఆర్‌టీటీ ప్రస్తుతం కీలక నిర్ణయాల్లో పాల్గొనలేకపోతోంది. దీంతో గురువారం జరిగిన టాటా ట్రస్ట్స్‌ సమావేశానికి కూడా ఎస్‌ఆర్‌టీటీ హాజరుకాలేకపోయినట్లు సమాచారం.

ఎస్‌డీటీటీతో పాటు ఇతర చిన్న టాటా ట్రస్టులు సమావేశంలో పాల్గొన్నాయి. టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా, ట్రస్టీలు వేణు శ్రీనివాసన్‌, డారియస్‌ ఖంబాటా, విజయ్‌ సింగ్‌ కూడా హాజరైనట్లు ‘ఇండియా టుడే’ పేర్కొంది. కానీ ఎస్‌ఆర్‌టీటీ లేకపోవడంతో రెండు ప్రధాన ట్రస్టులు కలిసి తీసుకోవాల్సిన నామినేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం కష్టంగా మారింది.

ముందుగా ఛారిటీ కమిషనర్‌.. లేదంటే హైకోర్టు?
ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు టాటా ట్రస్ట్స్‌ ప్రయత్నిస్తోంది. ఎస్‌ఆర్‌టీటీపై ఉన్న ఆంక్షలను తొలగించి కీలక నిర్ణయాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ ముందు అత్యవసర విచారణకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అక్కడ పరిష్కారం లభించకపోతే బాంబే హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉందని ‘ఇండియా టుడే’ కథనం తెలిపింది. అయితే తొలుత ఛారిటీ కమిషనర్‌ నుంచే ఉపశమనం పొందాలని ట్రస్ట్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే వారం టాటా సన్స్‌ ఏజీఎం
వచ్చే మంగళవారం జరగనున్న టాటా సన్స్‌ ఏజీఎం నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత కీలకంగా మారింది. ఎస్‌ఆర్‌టీటీ పాల్గొనలేని పరిస్థితి కొనసాగితే ఏజీఎంకు అవసరమైన కోరం, ఓటింగ్‌ ప్రక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

టాటా ట్రస్ట్స్‌ అవసరమైన కోరం, ఓట్లను సమీకరించి చంద్రశేఖరన్‌ డైరెక్టర్‌ పదవికి వ్యతిరేకంగా ఓటు వేస్తే.. ఆయన ప్రస్తుత పదవీకాలం ముగిసే 2027 ఫిబ్రవరి 20 కంటే ముందే పదవి నుంచి తప్పుకునే పరిస్థితి రావచ్చు. మరోవైపు అవసరమైన కోరం సమకూరకపోతే ఏజీఎం వాయిదా పడే అవకాశం కూడా ఉందని నివేదిక పేర్కొంది.

టాటా గ్రూప్‌ ముందున్న సవాళ్లు

చంద్రశేఖరన్‌ వారసుడిని ఎంపిక చేయడం ఒకవైపు.. ఆ ఎంపిక ప్రక్రియ సజావుగా సాగేందుకు టాటా ట్రస్ట్స్‌ పాలనా వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించడం మరోవైపు. ప్రస్తుతం ఈ రెండు అంశాలూ ఒకేసారి టాటా గ్రూప్‌ ముందున్నాయి.
Advertisement
N Chandrasekaran
Tata Sons Chairman
Sir Ratan Tata Trust
Noel Tata
Maharashtra Charity Commissioner
Tata Trusts legal battle

More Telugu News