Perni Nani: అవినాశ్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా? ఎందుకు ఇలాంటివి రాస్తున్నారు?: పేర్ని నాని

  • అవినాశ్ రెడ్డికి మద్దతుగా మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని
  • చంద్రబాబు ఎన్నో కేసుల్లో బెయిల్ తెచ్చుకున్నారని వెల్లడి
  • అవినాశ్ రెడ్డి బెయిల్ కు ప్రయత్నించడంలో తప్పేముందని ప్రశ్నించిన వైనం
Pern Nani slams media

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వివేకా కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ ఎత్తుగడలు అంటూ కొన్ని వర్గాల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తమ ఎంపీకి బాసటగా నిలుస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. 

గుండెపోటుకు గురైన తల్లికి చికిత్స అందిస్తుంటే ఎంపీ అవినాశ్ విచారణ నుంచి వెసులుబాటు కోరారని, దానిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అవినాశ్ తల్లిని హైదరాబాద్ తరలిస్తుంటే, మార్గమధ్యంలో మంచి ఆసుపత్రి ఉండడంతో అత్యవసర వైద్యం కోసం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి తరలించారని పేర్ని నాని వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు.

ఇప్పటికే అవినాశ్ రెడ్డి పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని, అరెస్ట్ భయం ఉంటే హాజరయ్యేవారేనా? అని పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో దారుణమైన కట్టుకథలు రాస్తున్నారని, హెలికాప్టర్ లో కేంద్ర బలగాలు దిగుతున్నాయని రాశారని విమర్శించారు. నాడు చంద్రబాబు... మోదీతో గొడవపెట్టుకుంటే సీబీఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టకూడదని హుకుం జారీ చేశారని, నేడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 

"అవినాశ్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా... లేదే! కేసుల్లో చంద్రబాబు ఎందుకు బెయిల్ తెచ్చుకుంటున్నాడు? టీవీల్లో డిబేట్లు పెట్టేవాళ్లు, ఎండా కాలంలోనూ కోట్లు వేసుకుని తిరిగేవాళ్లు ఎందుకు కేసుల్లో బెయిల్ తెచ్చుకుంటున్నారు? చంద్రబాబు ఎన్ని కేసుల్లోనైనా బెయిల్ తెచ్చుకోవచ్చా? ఏనాడైనా చంద్రబాబు విచారణ ఎదుర్కొన్నాడా? నిజాయతీని నిరూపించుకున్నాడా? చంద్రబాబు అన్నం తిని బతకడం కంటే బెయిల్ మీద బతకడమే ఎక్కువగా ఉంది" అని విమర్శించారు.

చంద్రబాబు కోసం మీడియా సంస్థలు ఎంతకైనా బరితెగించడం చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాలని అన్నారు. ఆఖరికి రామోజీరావు కూడా బెయిల్ తెచ్చుకోవచ్చు కానీ, అవినాశ్ రెడ్డి మాత్రం బెయిల్ తెచ్చుకోకూడదా? బెయిల్ తెచ్చుకునే అర్హత రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణలకే ఉందా? ఇంకెవరికీ లేదా? అని పేర్ని నాని నిలదీశారు. కనీస మానవత్వం లేని వాళ్లు... జగన్ ను చూస్తే వీళ్లకు ఈ కడుపు మంట ఎందుకో అర్థం కాదు అని వ్యాఖ్యానించారు.

More Telugu News