Dhulipala Narendra Kumar: సీమెన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కుమ్మక్కయింది: ధూళిపాళ్ల

Dhulipalla slams AP Govt
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పందించారు. సీమెన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపించారు. 

సీమెన్స్ సంస్థను ప్రభుత్వం ఈ కేసు నుంచి తప్పించిందని, ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చలేదని వివరించారు. సీమెన్స్ ఒప్పందంపై వైసీపీ ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ చేయించిందా? అని ప్రశ్నించారు. ఒకవేళ చేయిస్తే, ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలు ఎందుకు బయటపెట్టడంలేదు? ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు ప్రకారం కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు. డిజైన్ టెక్ సంస్థ, డిజైన్ టెక్ ఎండీపై మాత్రం కేసులు పెట్టారని, సీమెన్స్ సంస్థపై ఎందుకు కేసులు పెట్టలేదు? అని ప్రశ్నించారు. 

సీమెన్స్ కు చెందిన ఒక్క సుమన్ బోస్ ను మాత్రమే బాధ్యుడిగా చూపుతున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. సుమన్ బోస్ సీమెన్స్ కు తొమ్మిదేళ్ల పాటు దేశంలో ప్రతినిధిగా వ్యవహరించాడని... టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకుంది సీమెన్స్ సంస్థతో తప్ప సుమన్ బోస్ తో కాదని స్పష్టం చేశారు. 

సీమెన్స్ సంస్థను తప్పించడం వెనుక రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం తమ వద్ద ఉన్న నివేదికలపై మాట్లాడకుండా, సీమెన్స్ సంస్థ అంతర్గత నివేదికలపై ఎందుకు మాట్లాడుతున్నట్టు? అని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థను కూడా ముద్దాయిగా చేర్చితే వాస్తవాలు బయటికి వస్తాయని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. 

సీమెన్స్ సంస్థ ఒప్పందంపై ముఖ్యమంత్రి కార్యాలయం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలను చంద్రబాబే తెచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Dhulipala Narendra Kumar
Siemens
ED
AP Govt
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News