Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

  • సీబీఐ విచారణకు ఆదేశించిన సింగిల్ బెంచ్  
  • సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన కోర్టు
  • ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన డివిజన్ బెంచ్ 
Telangana High court hands over investigation in MLA Poaching Case to CBI

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. 

కేసును సీబీఐకి అప్పగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. ఇక గత మూడు నెలలుగా ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఏసీబీ నుంచి సుప్రీం కోర్టు దాకా ఈ కేసును పరిశీలించాయి. సిట్ దర్యాప్తుతోనే ఈ కేసులో అన్ని విషయాలు బయటపడతాయని ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు వాదించింది. 

అయితే.. సిట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని ప్రతివాదులు పేర్కొన్నారు. సీబీఐతో విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐకి ఇవ్వొద్దంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. మరోపక్క, ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి 15 రోజుల పాటు తీర్పును సస్పెన్షన్ లో ఉంచాలని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోరినప్పటికీ, హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.

More Telugu News