Nara Lokesh: మేం అధికారంలోకి రాగానే పాత ఇసుక పాలసీ తీసుకొస్తాం: నారా లోకేశ్

  • పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • బైరెడ్డిపల్లె మండలంలోని గ్రామాల్లో రైతులు, భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతి
  • కౌలు రైతులను ఆదుకుంటామని భరోసా  
 we will bring old sand policy says Nara Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా బైరెడ్డి పల్లె మండలంలోని గ్రామాల్లో పలువురితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాకే ఊరులో చెరుకు రైతు వెంకట రమణ తో నారా లోకేశ్ మాట్లాడారు. తనకి ఉన్న ఒకటిన్నర పొలం, బెల్లం గానుగ లోకేశ్ కి చూపించి చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులు రైతు ఆయన దృష్టికి తెచ్చారు. చెరుకు రైతులు కనీస మద్దతు ధర లేక పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని లోకేశ్ అన్నారు. 

‘వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందు కారణంగా రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయానికి సాయం అందించడం నా బాధ్యత. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. కౌలు రైతులను ఆదుకుంటాం’ అని లోకేశ్ చెప్పారు. 

అనంతరం బేలుపల్లె లో పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు వెళ్లి పలకరించారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని భవన నిర్మాణ కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాము అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధులు కూడా ప్రభుత్వం పక్క దారి పట్టించింది. వైసీసీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని లోకేశ్ విమర్శించారు.

ఆ తర్వాత వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ‘వాల్మీకులకు సీఎం జగన్  వెన్నుపోటు పొడిచారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసి వాల్మీకుల స్థితిగతులపై అధ్యయనం చేశాం. వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని 2017 లో అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపాం.  ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రధాని మోదీ గారికి చంద్రబాబు గారు వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని పోరాడుతూ లేఖ రాశారు. వైసీపీకి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నా వాల్మీకుల గురించి మాట్లాడటం లేదు. పోరాడటం లేదు. వాల్మీకి సోదరులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడం కోసం కంపెనీలు ఏర్పాటు చేస్తాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.

More Telugu News