Kakani Govardhan Reddy: కొడుకు లోకేశ్ ను చంద్రబాబు చివరి అస్త్రంలా వదిలాడు: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

  • కుప్పం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర
  • టీడీపీకి మరో పరాభవం తప్పదన్న కాకాణి
  • లోకేశ్ ప్రజాసమస్యలు తెలియని వ్యక్తి అని వ్యాఖ్య  
  • యువగళం వికసించే గళం కాదని ఎద్దేవా 
Kakani Govardhan Reddy slams Lokesh

నారా లోకేశ్ కుప్పం సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కుమారుడు లోకేశ్ ను చంద్రబాబు చివరి అస్త్రంలా వదిలాడని, లోకేశ్ పాదయాత్రతో వైసీపీ భయపడబోదని, ఆ పరిస్థితే రాదని అన్నారు. టీడీపీకి మరో పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. 

కానీ, యువగళం పేరుతో చంద్రబాబు ఉద్రిక్తతలు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని కాకాణి తెలిపారు. అందుకే ఈ పాదయాత్రకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. 

అసలు, లోకేశ్ పాదయాత్ర చేస్తుండడం, దానిపై తాము స్పందించాల్సి రావడం దౌర్భాగ్యం అని భావిస్తున్నామని తెలిపారు. దీనికంటే చంద్రబాబు పాప పరిహార యాత్ర చేపడితే బాగుండేదని అన్నారు. ప్రజా సమస్యలు తెలియని వ్యక్తి లోకేశ్ అని, యువగళం వికసించే గళం కాదని కాకాణి విమర్శించారు.

More Telugu News