Narendra Modi: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. స్పందించిన అమెరికా

  • ఆ డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదన్న అమెరికా
  • భారత ప్రజాస్వామ్యం శక్తిమంతమైనదని వ్యాఖ్య
  • రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేసే అంశాల గురించే ఆలోచిస్తామని వెల్లడి
what us said on bbc documentary on modi

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2002లో గుజరాత్‌ లో జరిగిన అల్లర్లు, ఆ ఉదంతంలో నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల గురించి డాక్యుమెంటరీలో ప్రశ్నలు లేవనెత్తడం వివాదాస్పదమైంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ కూడా మోదీకి మద్దతుగా మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై అమెరికా స్పందించింది.

‘‘మీరు చెబుతున్న డాక్యుమెంటరీ గురించి మాకు తెలియదు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. భారత ప్రజాస్వామ్యం శక్తిమంతమైనది. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుంది’’ అని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ స్పష్టం చేశారు. అలాగే రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేసే అంశాలను గురించే తాము ఆలోచిస్తామని తెలిపారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అమెరికా, భారత్‌ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని నెడ్‌ ప్రైస్‌ పేర్కొన్నారు.

‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను ఇటీవల యూట్యూబ్‌ (ఇండియా)లో బీబీసీ అప్‌లోడ్‌ చేసింది. అయితే అప్‌లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది. డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ధ్వజమెత్తారు.

More Telugu News