Tollywood: భోజనం చేసి అలానే వాలిపోయారు.. నాన్న చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారు: రవిబాబు

  • చలపతిరావు గురించి మాట్లాడిన ఆయన కుమారుడు రవిబాబు
  • ఆయనకు రామారావు, భోజనం, హాస్యం అంటే చాలా ఇష్టమని వెల్లడి
  • పరిశ్రమలో ఎంతో మందికి సాయం చేశారని తాను ఇండస్ట్రీకి వచ్చాకే తెలిసిందని వ్యాఖ్య
My father left us very peacefully says Ravibabu

తన తండ్రి, ప్రముఖ నటుడు చలపతి రావు  చాలా ప్రశాంతంగా కన్నుమూశారని నటుడు, దర్శకుడు రవిబాబు తెలిపారు. ‘నిన్న రాత్రి 8.30 గంటలకు నాన్నగారు కన్నుమూశారు. ఆయన జీవితంలో ఎలా హ్యాపీగా ఉన్నారో, అందరినీ ఎలా నవ్విస్తూ ఉండేవారో అలానే ప్రశాంతంగా వెళ్లిపోయారు. భోజనం చేసి, చికెన్ కూర, చికెన్ బిర్యాని తిన్నారు. ఆ ప్లేట్ ను ఇచ్చి వెనక్కి వాలిపోయారు. అంత సింపుల్ గా, హ్యాపీగా వెళ్లిపోయారు. ఈ రోజే అంత్యక్రియలు నిర్వహిద్దామనుకున్నాం. కానీ, మా సిస్టర్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్లు రావడానికి టైం పడుతుంది. మంగళవారం మంచి రోజు కాదు కాబట్టి బుధవారం నిర్వహిస్తాం’ అని మీడియాతో చెప్పారు.

ఇండస్ట్రీలో తన తండ్రి ఎంతో మందికి సాయం చేశారని, ఆ విషయం కుటుంబంలో ఎవ్వరికీ తెలిసేది కాదన్నారు. తాను పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతనే ఆయన ఎలాంటి వారో పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. ‘మా నాన్న గురించి నాకంటే మీ అందరికే ఎక్కువ తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఇండస్ట్రీలో ఎలా ఉంటారనే విషయం చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తెలిసింది. అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పేవారు. ఎంతో మందికి సాయం చేశారని తెలిసింది. 

ఈ విషయాలు మాకు తెలిసేవి కాదు. మా నాన్నకు  రామారావు గారు, ఆహారం, హాస్యం ఈ మూడే చాలా ఇష్టం. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అలానే ఇప్పుడు ఒక్క క్షణంలో ఎలాంటి బాధ లేకుండా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అలాంటి వ్యక్తికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. నా కొత్త సినిమాలో ఆయన చివరగా నటించారు. ఐదు రోజుల క్రితమే షూటింగ్ లో పాల్గొన్నారు. అదే ఆయనకు చివరి చిత్రం’ అని రవిబాబు వెల్లడించారు.

More Telugu News