Chiranjeevi: ‘ఫ్యామిలీతో విహార యాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర’ అంటూ మెగాస్టార్ డబుల్ ధమాకా

  • వాల్తేరు వీరయ్య పాటల చిత్రీకరణకు యూరప్ వెళ్లిన చిత్ర యూనిట్
  • తన వెంట కుటుంబ సభ్యులను  తీసుకెళ్లిన మెగాస్టార్
  • వచ్చే నెల 13న విడుదల కానున్న సినిమా
chiranjeevi Outing With Family And Waltair Veerayya Co Star Shruti Haasan In Europe

మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం మెగా అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత చిరు పూర్తి మాస్ ఎంటర్ టైనర్ చేస్తుండటం, ముఠామేస్త్రి తరహా క్యారెక్టర్ లో టీజర్ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అది పూర్తి చేసుకొని జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సంక్రాంతికి కలుద్దాం’ అంటూ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన చిరంజీవి చిత్రం షూటింగ్ పూర్తి చేసేందుకు గురువారం యూరప్‌ బయల్దేరారు. అక్కడ చిరంజీవి, హీరోయిన్ శ్రుతి హాసన్ పై రెండు పాటలు తీయనున్నారు.

పనిలో పనిగా ఈ ట్రిప్ నే చిరంజీవి తన కుటుంబానికి విహార యాత్రగా మార్చేశారు. తన భార్య సురేఖ, కూతురు సుష్మిత, మనవరాళ్లతో కలిసి విమానం ఎక్కేశారు. ‘ ఓ వైపు కుటుంబ సభ్యులతో, మరోవైపు శ్రుతి హాసన్‌తో కలిసి విమానంలో దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ఫ్యామిలీతో విహార యాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ప్రత్యేక పాటలో నర్తించింది. దీన్ని ఫస్ట్ సింగిల్ గా ‘బాస్ పార్టీ’ పేరిట లిరికల్ సాంగ్ విడుదల చేయగా సూపర్ హిట్ అయ్యింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More Telugu News