Tollywood: నాగశౌర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో మొదలైన కొత్త చిత్రం

  • రామానాయుడు స్టూడియోలో కొత్త చిత్రం ప్రారంభం
  • దర్శకుడిగా ఎస్.ఎస్. అరుణాచలం 
  • ఈ మధ్యే ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య
Naga Shaurya 24th movie launched with a formal Pooja Ceremony

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరోల్లో యువ నటుడు నాగశౌర్య ముందుంటాడు. ఇటీవల ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ, ఆ చిత్రం ఆశించినంత ఆడలేదు. ఏమాత్రం నిరుత్సాహ పడకుండా తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు యువ హీరో. శౌర్య హీరోగా ఎస్‌.ఎస్‌.అరుణాచలం దర్శకత్వం వహిస్తోన్న కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. నాగశౌర్య కెరీర్ లో ఇది 24వ చిత్రం. ముహూర్తపు షాట్‌కు సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేశారు. కిషోర్ తిరుమల గౌరవ దర్శకత్వం వహించారు. 

యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా దీన్ని రూపొందిస్తున్నామని చిత్ర బృందం ఈ సందర్భంగా ప్రకటించింది. నాగశౌర్య ఈ చిత్రంలో కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడని తెలిపింది. ఈ చిత్రానికి హారిస్‌ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. వెట్రి పళనిసామి సినిమాటోగ్రాఫర్. చోటా కె ప్రసాద్ ఎడిటర్‌‌గా పనిచేస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని చింతలపూడి బ్రదర్స్ శ్రీనివాసరావు, విజయ్ కుమార్, డా.అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. నాగశౌర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం.

More Telugu News