Akshata: బ్రిటన్ రాణి కన్నా సునక్ భార్య ఆస్తులే ఎక్కువ

  • ఇన్ఫోసిస్ లో 700 మిలియన్ డాలర్ల వాటా ఆమెదే
  • ఏటా డివిడెండ్ల రూపంలో మిలియన్ల డాలర్ల రాబడి
  • ఇప్పటికీ భారత పౌరసత్వం వదులుకోని అక్షతా సునక్
  • బ్రిటన్ లో పన్నులు ఎగ్గొట్టేందుకేనని విమర్శలు
 AKSHATA RICHER THAN THE BRITISH QUEEN

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునక్ దంపతులు మల్టీమిలియనీర్లనే విషయం తెలిసిందే. అయితే, సునక్ భార్యకు పెద్దసంఖ్యలో ఆస్తులు ఉన్నాయని, బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 ఆస్తులకన్నా అక్షత ఆస్తుల విలువే ఎక్కువని సమాచారం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురే ఈ అక్షతా మూర్తి. తండ్రి స్థాపించిన కంపెనీలో అక్షతకు పెద్దమొత్తంలో వాటా ఉంది. ఏటేటా డివిడెండ్ రూపంలో భారీ మొత్తాన్ని అక్షత అందుకుంటున్నారు. రిషి సునక్ మొదటిసారి ప్రధాని పదవికి బరిలో నిలిచినపుడు ఆయనకన్నా అక్షత పేరే ఎక్కువగా అక్కడి మీడియాలో మార్మోగింది. అక్షత ఇప్పటికీ భారత పౌరసత్వం వదులుకోలేదు. దీంతో భారత్ సహా విదేశాలలోని కంపెనీల నుంచి అందుకునే డివిడెండ్, ఇతరత్రా ఆదాయంపై బ్రిటన్ లో పన్ను చెల్లించక్కర్లేదు. ఇది విమర్శలకు దారితీసింది. ఇలా పన్ను ఎగవేయడానికే అక్షత ఇంకా భారత పౌరురాలిగానే కొనసాగుతున్నారని బ్రిటన్ ఎంపీలు ఆరోపించారు. దీంతో బ్రిటన్ లో కూడా పన్ను కడతానని అక్షత వివరణ ఇచ్చారు.

ఇన్ఫోసిస్ లో అక్షతకు 3.89 కోట్ల షేర్ ఉంది. మొత్తం షేర్లలలో ఇది 0.98 శాతమే అయినప్పటికీ కంపెనీలో అక్షత వాటా విలువ దాదాపు రూ.6 వేల కోట్లకు పైనేనని సమాచారం. ఇటీవలే ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి రూ.126 కోట్లను డివిడెండ్ రూపంలో అందుకున్నారు. దీంతోపాటు అక్షతా డిజైన్స్ పేరుతో దుస్తుల తయారీ బ్రాండ్ సహా మూడు నాలుగు సంస్థలకు అక్షతే యజమాని. వీటన్నిటి విలువను మదింపు చేస్తే క్వీన్ ఎలిజబెత్ ఆస్తుల కన్నా ఎక్కువేనట. రాణి ఆస్తుల విలువ మన రూపాయల్లో సుమారు 3400 కోట్లు అయితే, అక్షత ఆస్తుల విలువ రూ.4200 కోట్లు (దాదాపు ఏడాది కిందటి అంచనా విలువ) అని అక్కడి మీడియా అప్పట్లోనే కథనాలు వెలువరించింది. అదికూడా రిషి సునక్ ఆస్తులు కాకుండా ఒక్క అక్షత పేరుమీదున్న ఆస్తుల విలువ మాత్రమే. ఇక రిషి ఆస్తుల విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుందని అంచనా. దంపతులిద్దరి ఆస్తుల మొత్తం విలువ రూ.7 వేల కోట్లకు పైనే.. బ్రిటన్ లో ఇప్పుడు అత్యంత ధనవంతురాలు అక్షతా మూర్తి, అక్కడి ప్రతినిధుల సభలోని ఎంపీలలో అత్యంత ధనవంతుడు రిషి సునక్ అని చెప్పవచ్చు.

More Telugu News