Nara Lokesh: ప్రతిపక్షంలో ఉండి ఇంత అభివృద్ధి చేస్తున్నా... గెలిస్తే ఇంకెంత చేసేవాడ్నో మంగళగిరి ప్రజలు ఆలోచించాలి: నారా లోకేశ్

Nara Lokesh explains what he done in Mangalagiri constituency
షార్ట్స్‌లో చూడండి
తాను గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలైనా ప్రజల్లోనే ఉన్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 12 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 

స్వర్ణకారుల సంక్షేమం కోసం లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినట్టు వివరించారు. నియోజకవర్గంలో పెళ్లిళ్లు జరిగితే పెళ్లి కానుక ఇస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. పురోహితులకు, పాస్టర్లకు, ఇమామ్, మౌజమ్ లకు పండుగ కానుకలు ఇచ్చామని తెలిపారు. 

"కోవిడ్ సమయంలో వైద్య సహాయం అందించాం. మంగళగిరి, తాడేపల్లిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రభుత్వం చేతగానితనం వలన రోడ్లు వెయ్యకపోతే నేను కొన్ని గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు వేసాను. వికలాంగులకు ట్రై సైకిళ్లు, స్వయం ఉపాధి కోసం 300 తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు అందించాం.  

కృష్ణా నది పక్కనే ఉన్నా నియోజకవర్గంలో తాగునీటి సమస్య అలానే ఉంది. జలధార కార్యక్రమం పెట్టి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా త్రాగునీరు అందించాం. కొన్ని గ్రామాల్లో త్రాగునీటి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. స్తీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. మంగళగిరి యువతకు 'యువ' కార్యక్రమం ద్వారా హైదరాబాద్ లో ఉచితంగా సాప్ట్ వేర్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. 

ఎన్టీఆర్ సంజీవని కార్యక్రమం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. దుగ్గిరాలలో ఎన్టీఆర్ సంజీవని వైద్య రథం, మంగళగిరి, తాడేపల్లిలో ఎన్టీఆర్ సంజీవని వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ 10 వేల మంది పేదలకు వైద్య సహాయం అందించాం. త్వరలో 15 రోజులకు ఒకసారి మా నాయకులను ఇంటింటికీ పంపి బిపీ, షుగర్ కి మందులు ఉచితంగా అందజేస్తాం. ప్రతిపక్షంలో ఉండి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా. అధికారంలో ఉంటే  నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తానో ప్రజలు ఆలోచించాలి" అని లోకేశ్ పేర్కొన్నారు.

అంతేకాదు, రెండుసార్లు ప్రజలు గెలిపించినా ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడం లేదని విమర్శించారు. తాను అడిగే ప్రశ్నలకు స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. 

"టీడీపీ హయాంలో నిధులు కేటాయించి శంకుస్థాపన చేసిన తాగునీటి పథకాన్ని ఎందుకు ఆపేశారు? అటవీ భూముల్లో ఉన్న ఇళ్లకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదు? పేదల ఇళ్లు ఎందుకు కూల్చారు? రైల్వే భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు అక్కడే పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన ఆర్కే ఎందుకు మాట తప్పారు? ఎమ్మెల్యే ఆదేశాలతోనే వారికి నోటీసులు ఎందుకు వెళ్ళాయి? గెలిచిన వెంటనే యూ 1 జోన్ ఎత్తేస్తాం అన్నారు. ఇప్పుడు 2 శాతం పన్ను కట్టాలి అని వేధిస్తున్నారు ఎందుకు? డంప్ యార్డ్ తొలగిస్తానన్న హామీ ఏమయ్యింది? " అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 

ప్రభుత్వం రూ.2500 కోట్ల అభివృద్ది నిధులు కేటాయిస్తే ఒక్క రూపాయి తెచ్చుకోలేని చేతగాని ఎమ్మెల్యే ఆర్కే అంటూ విమర్శించారు. "సీఎం ఇంటి పక్కన ఉండే బ్రిడ్జ్ కట్టలేని దుస్థితి. రూ.6 కోట్లు ఖర్చు చేస్తే కొత్త బ్రిడ్జ్ నిర్మించే అవకాశం ఉన్నా రూ.3 కోట్లతో రిపేర్లు చేశారు. అయినా అక్కడ పరిస్థితి మారలేదు. నియోజకవర్గంలో టీడీపీ కట్టిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసుకోవడం తప్ప పేదలకు ఒక్క ఇళ్లు కట్టలేదు. నియోజకవర్గంలో పేదలకు 10 వేల ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది.

తాడేపల్లి గంజాయికి అడ్డాగా మారినా చర్యలు లేవు. గంజాయి మత్తులో మృగాళ్లు కృష్ణా నది ఒడ్డున మహిళపై అత్యాచారం చేశారు. ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యలేదు. ఇసుకలో ఎమ్మెల్యే భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించింది, పందులు తిరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో భారీ అవినీతి జరుగుతుంది. దమ్ముంటే మంగళగిరి నియోజవర్గంలో టీడీపీ, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి" అని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Mangalagiri
TDP
MLA RK
YSRCP

More Telugu News