loan recovery: దారుణం.. గర్భిణిపై ట్రాక్ట‌ర్ ఎక్కించి చంపిన‌ లోన్ రిక‌వ‌రీ ఏజెంట్లు

  • ఝార్ఖండ్ లోని హ‌జారీబాగ్ లో ఘ‌ట‌న‌
  • ట్రాక్ట‌ర్ రిక‌వ‌రీ కోసం స‌మాచారం ఇవ్వ‌కుండానే వ‌చ్చిన ఏజెంట్లు
  • అడ్డొచ్చిన రైతు కూతురుని ట్రాక్ట‌ర్ తో ఢీకొట్టిన వైనం
Pregnant woman crushed under tractor by loan recovery officials in Jharkhand

ఝార్ఖండ్‌లో లోన్ రిక‌వ‌రీ ఏజెంట్లు దారుణానికి ఒడిక‌ట్టారు. గర్భిణి అయిన రైతు కూతురుపై ట్రాక్ట‌ర్ ఎక్కించి ఆమె మృతికి కార‌ణం అయ్యారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో శుక్రవారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బాధితురాలు తండ్రి ఓ ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని ట్రాక్ట‌ర్ కొనుగోలు చేశారు. వాయిదాలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఏజెంట్లు ట్రాక్ట‌ర్‌ను స్వాదీనం చేసుకోవాల‌ని అనుకున్నారు. కానీ, రైతుకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వ‌కుండానే ఇంటికి వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఇంటిద‌గ్గ‌ర ఉన్న రైతు కుమార్తెకు, ఏజెంట్ల‌కు మధ్య వాగ్వాదం జరిగింది.

ఆమెపై దాడి చేసి, ప‌క్క‌కు తోసేసి రిక‌వ‌రీ ఏజెంట్లు ట్రాక్ట‌ర్ తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. స‌ద‌రు మ‌హిళ అడ్డు రావ‌డంతో ఆమెపైకి ట్రాక్ట‌ర్ ఎక్కించారు. తీవ్ర గాయాల పాలైన గ‌ర్భిణిని బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్ప‌టికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై హ‌త్య కేసు న‌మోదైంద‌ని హజారీబాగ్ ఎస్పీ, మనోజ్ రతన్ చోథే  తెలిపారు. ట్రాక్టర్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు ఫైనాన్స్ కంపెనీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ కు కూడా స‌మాచారం ఇవ్వలేదని పోలీసు అధికారి తెలిపారు.

More Telugu News