BJP: మోదీ స‌భ‌లో ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి... ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్

  • ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన విజ‌య సంక‌ల్ప స‌భ‌
  • ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ కోసం నినాదాలు చేసిన ఎమ్మార్పీఎస్ కార్య‌కర్త‌లు
  • మూకుమ్మ‌డిగా దాడికి పాల్ప‌డ్ద బీజేపీ శ్రేణులు
  • దాడిని ఖండించిన‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్
rs praveen kumar condemns attack on mrps karyakartas in bjp meeting

బీజేపీ తెలంగాణ శాఖ విజయ సంకల్ప సభ పేరిట ఆది‌వారం సికింద్రాబాద్ ప‌రిధిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ‌ను డిమాండ్ చేస్తూ నినాదాలు చేసిన మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి(ఎమ్మార్పీఎస్‌) కార్య‌క‌ర్త‌ల‌పై బీజేపీ శ్రేణులు మూకుమ్మ‌డి దాడికి పాల్ప‌డ్డాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా... దానిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్‌లో బీజేపీ శ్రేణుల‌ను హంత‌కులుగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ అభివ‌ర్ణించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సాక్షిగానే బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన నేత‌లు ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను చిత‌క‌బాద‌టాన్ని ఖండిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంతేకాకుండా '90 శాతం ఉన్న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు అడుక్కోవ‌డం ఏమిటి? పాలకులమై ఈ దేశాన్ని ఏలుదాం రండి' అంటూ ఆయ‌న వారిని ఆహ్వానించారు. మళ్లీ మీ నాయకుల చేతిలో మోసపోకండి అని సూచించిన ఆర్ఎస్ ప్ర‌వీణ్‌.. ఇకనైనా కళ్లు తెరవండి అంటూ పిలుపునిచ్చారు.

More Telugu News