Ketaki Chitale: శరద్‌పవార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. నటి కేతకి చితాలేకు బెయిలు

  • పవార్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు
  • కేతకి అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని కోర్టు ఆగ్రహం
  • పోలీసుల తరపున కోర్టుకు క్షమాపణలు తెలిపిన పీపీ
  • 40 రోజుల తర్వాత జైలు నుంచి కేతకి బయటకు
Thane court grants bail to Marathi actor Ketaki Chitale

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్‌పై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన మరాఠీ నటి కేతకి చితాలే (29)కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. మే 14న అరెస్ట్ అయిన కేతకి 40 రోజులపాటు జైలులో గడిపారు. శరద్ పవార్‌ను ఉద్దేశించి ‘‘నరకం వేచి చూస్తోంది.. మీరు బ్రాహ్మణులను ద్వేషిస్తారు’’ అంటూ మరాఠీ కవితను కేతకి గత నెలలో తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. 

ఈ నేపథ్యంలో శరద్ పవార్ మద్దతుదారుడి ఫిర్యాదుతో థానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇదే ఘటనకు సంబంధించి ఆమెపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో 20కిపైగా కేసులు నమోదయ్యాయి. గతంలో ఆమె పెట్టుకున్న బెయిలు దరఖాస్తు తిరస్కరణకు గురికాగా, తాజాగా థానే కోర్టు రూ. 20 వేల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది.

కాగా,  చితాలేకు బెయిలు మంజూరు చేస్తూ పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను అరెస్ట్ చేసేటప్పుడు సరైన విధానాన్ని అనుసరించలేదని పేర్కొంది. నిబంధనలను పాటించని దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ తప్పిదానికి పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్షమాపణలు చెప్పారు. కాగా, 2020లో ఆమెపై నమోదైన అట్రాసిటీ కేసులో ఈ నెల 16న ఆమెకు బెయిలు మంజూరైంది.

More Telugu News