అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
- థామస్ కప్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ జట్టు
- టీమ్ మెంబర్స్ తో ప్రధాని మోదీ ముచ్చట్లు
- ఆటగాళ్లకు అభినందనలు
- ప్రధాని మోదీకి బాల్ మిఠాయి అందించిన లక్ష్య సేన్
"ప్రధాని మోదీ చిన్న చిన్న విషయాలపైనా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అల్మోరా ప్రాంతంలో దొరికే ప్రత్యేకమైన స్వీట్ బాల్ మిఠాయి గురించి కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆ స్వీట్ ను తీసుకురమ్మని నన్ను కోరారు. ప్రధాని కోసం బాల్ మిఠాయి తీసుకువచ్చాను. అంతేకాదు, మా తాతయ్య, మా నాన్న కూడా బ్యాడ్మింటన్ ఆడేవాళ్లన్న సంగతి కూడా ప్రధానికి తెలుసు. ఎంతో పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఇంతటి చిన్న చిన్న విషయాల గురించి కూడా చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనతో మాట్లాడుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది" అని లక్ష్య సేన్ తెలిపాడు.
20 ఏళ్ల లక్ష్య సేన్ ఉత్తరాఖండ్ లోని అల్మోరా ప్రాంతానికి చెందినవాడు. కొద్దికాలంలోనే జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి షట్లర్ గా ఎదిగిన లక్ష్య సేన్, ఆపై అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాడు. ప్రస్తుతం లక్ష్య సేన్ వరల్డ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 9వ స్థానంలో ఉన్నాడు.