Jeevitha Rajasekhar: ఆర్యవైశ్యులు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు.. నేను మాట్లాడిన ఉద్దేశం వేరు: జీవితా రాజశేఖర్‌

  • డబ్బు విషయంలో శివానీ జాగ్రత్తగా ఉంటుందని చెప్పడానికే కోమటి అనే పదం వాడానన్న జీవిత 
  • తన కూతురు ఎవరితోనో వెళ్లిపోయిందని ప్రచారం చేశారని ఆవేదన 
  • 'గరుడవేగ' సినిమా వివాదం కోర్టులో ఉందని వివరణ 
Jeevitha Rajasekhar requests Arya Vaisyas not to misunderstand her

రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఈవెంట్ లో జీవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జీవితపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ సందర్భంగా శివానీ, శివాత్మిక ఇద్దర్లో ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారని యాంకర్ ప్రశ్నించగా.. ఇద్దరూ ఫుడ్ మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంటారని జీవిత చెప్పారు. 

శివానీ పేరు స్విగ్గీ వాళ్లకు బాగా తెలుసని.. కొంచెం లేట్ అయినా ఆమె ఒప్పుకోదని.. దానిది కోమటిదాని లెక్కని.. డబ్బులు ఇచ్చేంత వరకు వాళ్లను వదిలిపెట్టదని జీవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా మాట్లాడారని, తమ కులానికి పిసినారితనాన్ని ఆపాదించేలా కామెంట్ చేశారని ఆర్యవైశ్యులు జీవితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వివాదంపై జీవిత స్పందిస్తూ... తనకు ఆర్యవైశ్యులంటే చాలా గౌరవం ఉందని చెప్పారు. వారిని కించపరచాలని తాను మాట్లాడలేదని... కోమటివాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారని, డబ్బుకు విలువనిస్తారని, చాలా పద్ధతిగా ఖర్చు చేస్తారని, సంపాదనలో కొంత మొత్తాన్ని దానధర్మాలు చేస్తారని, దేవుడి హుండీల్లో వేస్తారని అన్నారు.

డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి.. 'కోమటోళ్ల లెక్క' అనే నానుడిని ఎప్పటి నుంచో వాడుతున్నారని... తాను కూడా ఆ ఉద్దేశంతోనే మాట్లాడానని, ఆర్యవైశ్యులను కించపరిచేందుకు కాదని చెప్పారు. ఆర్యవైశ్యుల గొప్ప క్వాలిటీని చెపుతూనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. శివానీ ఒక్క పైసాను కూడా వదులుకోదని... కోమటోళ్ల మాదిరి జాగ్రత్తగా ఉంటుందనే ఉద్దేశంతోనే మాట్లాడానని చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నానని అన్నారు. 

ఇదిలావుంచితే, నిన్న కాక మొన్న రాజశేఖర్, జీవిత కూతురు ఎవరితోనో వెళ్లిపోయిందని దుష్ప్రచారం చేశారని... ఈ విషయంలో ఒకసారి శివాని పేరు, మరోసారి శివాత్మిక పేరు చెబుతూ ప్రచారం చేశారని జీవిత మండిపడ్డారు. తామేదో ఒక ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్తే... ఆ ఫొటోలు వేసి బోయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయిందని రాశారని చెప్పారు. 

అయితే, మీడియా మొత్తం తప్పుగా రాస్తుందని తాను చెప్పడం లేదని... కొందరు మాత్రం తప్పు చేస్తున్నారని అన్నారు. దయచేసి తమ బాధను అర్థం చేసుకోవాలని... తప్పు చేసుంటే రాయడంలో తప్పులేదని... లేని విషయాలను రాయడం సరి కాదని చెప్పారు. లీగల్ గా ఫైట్ చేయొచ్చని, పరువునష్టం దావా కూడా వేయొచ్చని... కానీ, అంత సమయం తమకు లేదని చెప్పారు. డబ్బు కూడా ఖర్చవుతుందని... అందుకే సినీ పరిశ్రమలో ఎవరూ లీగల్ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 

ఇక 'గురుడవేగ' సినిమా వివాదం కోర్టులో ఉందని జీవిత చెప్పారు. ఆ సినిమా నిర్మాతలకు, తనకు మధ్య ఏం జరిగిందనేది తమకు తెలుసని అన్నారు. చెక్ బౌన్స్ కేసును వారు తనపై వేశారని.. కోర్టులో కేసు తేలకముందే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం సరికాదని అన్నారు. తప్పు చేస్తే ఏ శిక్ష అయినా వేయండని చెప్పారు.

More Telugu News