Atchannaidu: 'మ‌హానాడు' వేదిక ఖ‌రారైంది.. రైతులే స్థ‌లాన్ని ఇచ్చారు: అచ్చెన్నాయుడు

  • మ‌హానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిర‌స్క‌రిస్తారా? అని అచ్చెన్న‌ ప్ర‌శ్న‌
  • స్టేడియం ఇవ్వ‌క‌పోతే మండువవారి పాలెంలో స్థ‌లం ఎంపిక చేశామ‌ని వివ‌ర‌ణ‌
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కోసం స‌మ‌ర్థంగా ప‌నిచేసేది టీడీపీ మాత్రమేన‌ని వ్యాఖ్య‌
  • మ‌ళ్లీ ఈ రాష్ట్రానికి పూర్వ‌స్థితి రావాల‌ని రైతులు కోరుకుంటున్నార‌న్న అచ్చెన్నాయుడు
atchennaidu slams ycp

ప్ర‌తి ఒక్క‌రికీ హ‌క్కులు ఉంటాయని, రాష్ట్రంలో ఆ హ‌క్కుల‌ను కాల‌రాసే విధంగా వైసీపీ ప్ర‌భుత్వ తీరు ఉంద‌ని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒంగోలులో ఆయ‌న ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ''మ‌హానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిర‌స్క‌రిస్తారా? ప్ర‌భుత్వం స్టేడియం ఇవ్వ‌క‌పోతే మండువవారి పాలెంలో స్థ‌లం ఎంపిక చేశాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కోసం స‌మ‌ర్థంగా ప‌నిచేసే పార్టీ తెలుగు దేశం మాత్రమే. ఈ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. మ‌ళ్లీ ఈ రాష్ట్రానికి పూర్వ‌స్థితి రావాలంటే టీడీపీ అధికారంలో రావాలని కోరుకుంటూ మండువవారి పాలెంలో రైతులు మ‌హానాడు ఏర్పాటు చేసుకోవ‌డానికి వారి స్థ‌లాన్ని ఇచ్చారు. 

రైతులు అంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌తలు చెబుతున్నాను. గ‌తంలో మ‌హానాడు మూడు రోజులు నిర్వ‌హించే వాళ్లం. ఈ సారి ఎండ‌లు అధికంగా ఉన్నాయి.. అందుకే రెండు రోజులు మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నాం. 27న ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు 10 వేల మందితో స‌భ నిర్వ‌హిస్తున్నాం. ఆ రోజు 17 తీర్మానాలు ప్ర‌వేశ పెడ‌తాం. 

అలాగే, త‌దుపరి రోజు నిర్వ‌హించే స‌మావేశంలో సాయంత్రం 3 గంట‌ల‌కు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాం. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు ప్రారంభిస్తున్నాం. గ్రామాల్లో వైసీపీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు. ప్ర‌భుత్వం ఏం చేసింద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు వైసీపీ వారు స‌రైన‌ స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు'' అని అచ్చెన్నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, మ‌హానాడులో మాట్లాడాల్సిన అంశాల‌పై ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు త‌మ పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

More Telugu News