Farm Laws: ‘డియర్ పోటస్’ అంటూ బైడెన్ కు ట్విట్టర్ లో తికాయత్ రిక్వెస్ట్

  • ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో ట్వీట్
  • రైతు సమస్యలపై మాట్లాడాలని విజ్ఞప్తి
  • నల్ల సాగు చట్టాలపై చర్చించాలని సూచన
Rakesh Tikait Tweets Biden Over Farm Laws

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఢిల్లీలో పంజాబ్, హర్యానా రైతులు ఆందోళన చేపట్టి 11 నెలలు దాటిపోయింది. దాదాపు 700 మంది రైతులు ఈ క్రమంలో చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు మేలు చేసే ఆ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రైతులతో సమావేశమైనా అవీ ఓ కొలిక్కి రాలేదు.

తాజాగా ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు, రైతు నేత రాకేశ్ తికాయత్. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘డియర్ పోటస్ (ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్)’ అంటూ తికాయత్ ట్వీట్ చేశారు.

‘‘డియర్ పోటస్.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో రైతులందరం 11 నెలలుగా ఆందోళన చేస్తున్నాం. ఇప్పటిదాకా 700 మంది రైతులు చనిపోయారు. మేం బాగుపడాలంటే ఈ నల్లచట్టాలు రద్దు కావాలి. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యే ముందు మా సమస్యలపైనా ఓసారి ఆలోచించండి. రైతుల గురించి గొంతెత్తండి’’ అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News