Sirisha Bandla: అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం: శిరీష బండ్ల

  • నిన్న అరుదైన అంతరిక్ష యాత్ర
  • విజయవంతంగా రోదసియానం చేసిన యూనిటీ-22
  • చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకున్న శిరీష
  • తన మనసింకా అంతరిక్షంలోనే ఉందని వెల్లడి
Sirisha Bandla describes her first space voyage an incredible event

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష యాత్రలో పాలుపంచుకున్న వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల (34) కూడా ఉన్నారు. తన మొట్టమొదటి రోదసి యాత్రపై ఆమె మాట్లాడుతూ, పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నారు. యాత్ర ముగిసి తాము భూమికి చేరినా, తన మనసింకా అంతరిక్షంలోనే ఉందని వ్యాఖ్యానించారు.

అంతరిక్షానికి వెళ్లాలన్నది తన చిన్ననాటి కల అని, ఇన్నాళ్లకు అది సాకారమైందని, అది కూడా సంప్రదాయేతర మార్గంలో నెరవేరిందని శిరీష వెల్లడించారు. ఇప్పటికీ తాను రోదసిలోకి వెళ్లి వచ్చానంటే నమ్మశక్యం అనిపించడంలేదని, ఆ భావన వర్ణనాతీతం అని వివరించారు.

ప్రపంచ కుబేరుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలో నిన్న వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక చారిత్రాత్మక రీతిలో అంతరిక్ష విహారం చేసి సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న శిరీష బండ్ల కూడా ఈ యాత్రలో భాగంగా అంతరిక్ష యానం చేసింది.

More Telugu News